HYDRAA: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీలో ఆక్రమణకు గురవుతున్న విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా (HYDRAA) ఆదివారం విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. సుమారు 1253.8 గజాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా హైడ్రా చేపట్టిన ఈ చర్య స్థానికుల్లో హర్షాన్ని నింపింది.
చక్రపురి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో తమ కాలనీలోని పార్కు స్థలం ఆక్రమణకు గురవుతోందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, తక్షణమే విచారణకు ఆదేశించారు. హైడ్రా అధికారులు, రెవెన్యూ , మున్సిపల్ అధికారులతో కలిసి అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 135లో ఉన్న వివాదాస్పద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
1985లోనే HUDA (LP నెం. 3814/MP2/HUDA/85) నిబంధనల ప్రకారం ఈ స్థలాన్ని పార్క్ , రోడ్ల అభివృద్ధి కోసం కేటాయించారు. గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ నెం. 12343/2022 ప్రకారం.. లేఅవుట్ నిర్వాహకులు ఈ భూమిని ప్రజా వినియోగం కోసం స్థానిక సంస్థలకు అధికారికంగా అప్పగించారు. పార్కు కోసం కేటాయించిన స్థలంలోని సరిహద్దు రాళ్లను తొలగించి, దానిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఆదివారం రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది.. ఆక్రమణలను అడ్డుకుని పార్కు చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ పార్కు స్థలమని స్పష్టం చేస్తూ అక్కడ హైడ్రా బోర్డులను పాతారు. తమ కాలనీ ఊపిరితిత్తుల వంటి పార్కు స్థలాన్ని కాపాడినందుకు చక్రపురి కాలనీ వాసులు హైడ్రా అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో హైడ్రా జిందాబాద్ అంటూ నినాదాలు మిన్నంటాయి.
Also Read: పోలీసుల సేవలకు సజ్జనర్ పురస్కారం.. 1,446 మంది సిబ్బందికి రివార్డుల ప్రదానం!