CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్లో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన ఆయన, రాబోయే 2 నెలల్లో జిల్లా కోసం ఒక ప్రత్యేకమైన అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని అన్నారు. ఈ ప్రణాళికకు అవసరమైన నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ ఆదిలాబాద్కు వస్తానని తెలిపారు.
గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని, ఆదిలాబాద్కు చుక్కా నీరు కూడా రాలేదని అన్నారు. ఆదిలాబాద్కు విమానాశ్రయం సాధించేందుకు కేంద్రంతో మాట్లాడామని, ఏడాదిలోగా ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకొస్తామని, పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని కేంద్ర పెద్దలను ఆహ్వానించామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కన్నతల్లి లాంటి సోనియాగాంధీ ఆశీర్వాదం తీసుకున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ప్రజలకు మంచి చేయాలనే నిరంతర లక్ష్యంతో పనిచేస్తున్నానని.. గత రెండేళ్లలో తాను కనీసం ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదని ఆదిలాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటును ఆయుధంగా మార్చుకుని రాష్ట్రంలో ప్రజా పాలన తీసుకొచ్చారని ఆయన కితాబిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాను రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తానని, బీజేపీ నాయకులను సైతం కలుపుకొని ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో ప్రతిపక్షాలకు ఎక్కడైనా అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. గతంలో తాను సచివాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా అప్పటి పాలకులు అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఏడాదిలోపు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ వస్తేనే పరిశ్రమలు వస్తాయని.. తద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ‘ఎర్రబస్సే కాదు… ఎయిర్ బస్సును కూడా ఆదిలాబాద్కు తెస్తాం’ అని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని, చారిత్రక ఇంద్రవెల్లిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ALSO READ: Mahesh Kumar: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కావాలనే రచ్చ చేస్తున్నారు… మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు