Naveen Yadav: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీల అభ్యర్థులలో గెలుపు ధీమా మరింత పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తానే విజయం సాధిస్తానని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో.. కౌంటింగ్కు ముందు ఆయన ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గెలుపుపై నవీన్ యాదవ్ ధీమా
ప్రజల ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని నవీన్ యాదవ్ ఈ సందర్భంగా అన్నారు. ‘జూబ్లీహిల్స్లో విజయం నాదే. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచే నాకు మంచి లీడ్ మొదలవుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 45 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలకు ఎంతో కీలకం కానుంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 48.49గా నమోదైంది. ఈ ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగనుంది. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఓట్లను లెక్కించనున్నారు. తొలుత షేక్పేట్ (Shaikpet) డివిజన్ ఓట్లను లెక్కించిన తర్వాత, వరుసగా మిగతా 6 డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పది రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ALSO READ: Jubilee Hills bypoll counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ షురూ.. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ లీడ్