Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: మల్కాజిగిరి మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకీ విస్తరిస్తుండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మున్సిపల్ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వీటిని అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రణాళికా నిబంధనలు పాటించకపోవడం, అనుమతి తీసుకున్న దానికంటే అదనపు అంతస్తులు నిర్మించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.
యమ్నంపేట ప్రాంతంలో భారీ కమర్షియల్ షెడ్లతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ప్లస్ ఫోర్, ఫైవ్ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. అలాగే జోడిమెట్ల సమీపంలో భారీ షెడ్లు, అన్నోజిగూడ , ఏదులాబాద్ ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నోటీసులకే పరిమితం కాకుండా, భౌతికంగా నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారులు వెనకడుగు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ అక్రమ నిర్మాణాల వెనుక అధికార పార్టీ నాయకుల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక అధికారుల ‘మామూళ్ల’ పర్వమే కారణమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడి నగరం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే ఒక ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కఠినంగా నిర్మూలించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం ద్వారానే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని వారు కోరుతున్నారు.
Also Read:ప్లాట్లు కొన్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి.. హైడ్రా సంచలన నిర్ణయం!