Rain Alert: దేశవ్యాప్తంగా వాతావరణం శరవేగంగా మారిపోతోంది. ఎండల తీవ్రతతో అల్లాడిన జనానికి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు దేశాన్ని చుట్టేస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ దాటుకుంటూ నేపాల్ సరిహద్దుల వరకు ఇవి విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి మరింత బలంగా వ్యాపించనున్నాయి. దీనికి తోడు, జూలై 2 నుండి వాయువ్య భారతదేశంలో కొత్తగా ఒక ‘పశ్చిమ అవాంతరం’ క్రియాశీలకం కాబోతోంది. దీని ప్రభావంతో రానున్న 24 నుండి 72 గంటల్లో దేశంలోని దాదాపు 23 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ నుండి అతి భారీ వర్షాల రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది.
తెలంగాణలో వానల జోరు..
తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని ఎడపల్లి, దామరచర్ల, చింతపల్లి వంటి ప్రాంతాలలో 8 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షపాతం రికార్డైంది. నిరంతరాయంగా కురుస్తున్న ఈ వానలతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం మళ్లీ పుంజుకుంది.
రైతన్నల్లో చిగురించిన ఆశలు.. ఖరీఫ్ సాగుకు సై
జూన్ ఆరంభంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఆందోళన చెందిన రైతన్నలకు ఈ వర్షాలు అమృతంలా మారాయి. సాధారణ సమయం కంటే కాస్త ఆలస్యంగా రుతుపవనాలు పలకరించినప్పటికీ.. ప్రస్తుత వాతావరణం ఖరీఫ్ సీజన్ సాగు పనులకు అత్యంత అనుకూలంగా మారిందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎండల ధాటికి ఎండిపోయిన భూములు ఇప్పుడు తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆనందంతో నాగలి పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో విత్తనాలు నాటడం, దుక్కులు దున్నడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి.
అధికార యంత్రాంగం అప్రమత్తం..
పంటలకు ఈ వర్షాలు మేలు చేకూరుస్తున్నప్పటికీ, మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు అవసరమని అధికారులు సూచిస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు వర్షపాత వివరాలను సేకరిస్తూ జిల్లాల వారీగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న పరిసరాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత విస్తరించనున్న నేపథ్యంలో, రైతులు వాతావరణ శాఖ జారీ చేసే రోజువారీ సూచనలను గమనిస్తూ తమ వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం మంచిది.
Also Read: నిప్పులు కాదండోయ్.. ఈ అగ్నిపర్వతం కురిపించేది అచ్చమైన బంగారం.. ఎక్కడుందో తెలుసా?