Thamilasai : తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం రేగింది. గవర్నర్ తమిళిసై సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి దర్శనం కోసం వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర ఉన్నతాధికారులెవరూ హాజరుకాకపోవడం మరోసారి వివాదానికి దారి తీసింది. గవర్నర్ ప్రోటోకాల్ అంశం చర్చనీయాంశంగా మారింది.
మల్లికార్జునస్వామి దర్శనం తర్వాత తమిళిసై మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ వివాదంపై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కొమురవెల్లికి రైల్వే స్టేషన్ కావాలని భక్తులు కోరారని తెలిపారు.
వీలైనంత త్వరగా కొమురవెల్లికి రైల్వేస్టేషన్ వచ్చేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే అనేకసార్లు గవర్నర్ తమిళిసై టూర్లో ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. కొంతకాలంగా గవర్నర్ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కావడం లేదు. తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ కూడా గతంలో బహిరంగంగా ప్రకటించారు. తమిళ సై యాదాద్రి, భదాద్రి పర్యటనల సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.
మరోవైపు గవర్నర్ పై టీఆర్ఎస్ నేతలేకాకుండా ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా తమిళిసై పై సీపీఐ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బిల్లులు ఎక్కవ కాలం పెండింగ్లో పెట్టే హక్కు గవర్నర్కు లేదని స్పష్టం చేశారు. బిల్లులపై మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గవర్నర్కు ఏమైనా అంశాలపై అనుమానం ఉంటే అధికారులతో మాట్లాడాలని సూచించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈ వ్యవస్థతో కేంద్రం రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.