
Corona Vaccine : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఇటు భారత్ లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు. బూస్టర్ డోసు వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కరోనా వ్యాక్సిన్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు బూస్టర్ డోసు కోసం ప్రజల క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లో సోమవారం 2,088 మంది టీకాలు వేయించుకున్నారు. ఇటీవలి కాలంలో ఏ రోజూ కూడా 2 వేల మందికి వ్యాక్సిన్ వేసిన దాఖలాలు లేవు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత నుంచి సాధారణంగా రోజూ దాదాపు 150 మంది మాత్రమే టీకాలు తీసుకుంటున్నారు.
చైనాను హడలెత్తిస్తున్న కరోనా బీఎఫ్7 రకం వైరస్ పై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్రం చేసిన సూచనలతో కోవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్తోపాటు ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు టీకా డోసులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. కొంతకాలంగా కొవిడ్ కేసులు నమోదు కాకపోవడంతో.. పరీక్షలతోపాటు టీకాల సరఫరాను దాదాపు అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నిలిపివేశారు. 90 శాతం దవాఖానాల్లో ఇదే పరిస్థితి ఉంది. మిగిలిన డోసులు వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వస్తుంటే వారిని వెనక్కి పంపాల్సివస్తోంది.
కరోనా కేసుల నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వ దవాఖానాలకు బూస్టర్ డోసు కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చాలా తక్కువ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అక్కడ కూడా వ్యాక్సిన్ డిమాండ్ తగ్గట్టుగా అందుబాటులో ఉండటంలేదు. వైద్యశాఖ అధికారులు ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కొందరు కరోనా భయం నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలు తీసుకుంటున్నారు.
ఎవరికి బూస్టర్ డోసు వేస్తారంటే..
55 ఏళ్లు పైబడినవారు, ఇప్పటికే హృద్రోగ, ఊపిరితిత్తుల వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ బాధితులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు.. దీర్ఘకాలికంగా స్టిరాయిడ్లు తీసుకుంటున్న రోగులు వెంటనే బూస్టర్ డోసు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వారికే మొదటి ప్రాధాన్యతగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రెండు డోసుల కరోనా టీకా తీసుకొని 6-8 నెలల సమయం దాటిన వారికి వ్యాక్సిన్ అందుబాటును బట్టి బూస్టర్ డోసు వేస్తారు.
CPI Narayana : దమ్ముంటే ఓయూకి వెళ్లి ఓట్లు అడగు! కేసీఆర్కు నారాయణ సవాల్..