Inter Results-2026: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10 లోపు విడుదల చేయాలని ప్లాన్ చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. అందుకు సంబంధించి చకచకా అడుగులు వేస్తోంది. ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 31 లోపు ఫలితాలు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఈ విధంగా చేయడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఈజీ అవుతుందని అధికారులకు చెబుతున్నారు.
మూడు వారాల్లో ఇంటర్ ఫలితాలు.. తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వేగంగా విడుదల చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది ఇంటర్ బోర్డు. ఏప్రిల్ 10 లోపు ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసేందుకు అడుగులు వేస్తోంది. ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఏప్రిల్ 10 లోపు సెకండియర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.
జూన్ ఒకటి నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈలోగా ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి మే 31 నాటికి వాటి ఫలితాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు కాగానే రాష్ట్రవ్యాప్తంగా మూల్యాంకనం మొదలుపెట్టింది. కొత్తగా ఈసారి స్పాట్ కేంద్రాల సమయం అదనంగా మరో రెండు గంటలు పెంచారు.
15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన మూల్యాంకనం
గతేడాది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మూల్యాంకనం సాగేది. తాజాగా అందుకున్న సమాచారం మేరకు ఈసారి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేయాలని డీఐఈవోలు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 16న విడుదల చేశారు.
ఈలోగా ఐఐటీల్లో సీట్లు పొందే విద్యార్థులు కాస్త ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది. ఇవన్నీ గమనించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, విద్యార్థుల ఫలితాల విషయంలో ఫలితాలు ఇస్తే బాగుంటుందని ఓ అంచనాకు వచ్చారట.
ఇక మూల్యాంకనం విషయానికి వద్దాం. గతంలో రోజుకు 30 పేపర్లు ఇచ్చేవారు. తాజాగా 45 పేపర్లు ఇస్తున్నారని కొందరు అధ్యాపకులు చెబుతున్నారు.
ALSO READ: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి, చంద్రబాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు
సమయం పెంచి జవాబు పత్రాలు ఎక్కువ ఇస్తామంటే ఎలా అని వాపోతున్నారు. దీనివల్ల పొరపాట్లు జరిగితే విద్యార్థులకు నష్టం జరుగుతుందని అంటున్నారు. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో మూల్యాంకనానికి హాజరు కాకుండా సెలవు పెట్టుకోవచ్చని తెలిపారట. తప్పకుండా రావాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని అంటున్నారు అధికారులు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సుమారు 10 లక్షల విద్యార్థులు హాజరయ్యారు.