తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో జరుగుతున్న పురోగతిని, తదుపరి కార్యాచరణను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని.. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, దీనిపై లోతైన దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు. ప్రస్తుతం విచారణ ప్రాథమిక దశలో ఉందని.. అధికారుల బృందం అన్ని కోణాల్లో ఆధారాలను సేకరిస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
సిట్ కార్యాలయం ఏర్పాటుపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే ఒక ప్రత్యేక కేంద్రాన్ని కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విచారణ అంతా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొనసాగుతోంది. దర్యాప్తులో వెల్లడయ్యే కీలక విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైన తర్వాత ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
ALSO READ: Bangladesh: బంగ్లాదేశ్లో హింస.. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? షేక్ హసీనా ఆశ్రయంపై భారత్లో చర్చ..!