Child Safety Warning: రీసెంట్ సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఓ పిల్లాడు జీప్ కారులో సన్ రూఫ్ ఓపెన్ చేసి నిలబడి ఉండగా, స్పీడ్ గా ఆ వెహికల్ ముందుకు వెళ్తుంది. కాస్త దూరం వెళ్లగానే పెద్ద వాహనాలు లోపలికి రాకుండా అడ్డుగా పెట్టిన ఓవర్ హెడ్ బీమ్ తగిలి ఆ పిల్లాడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి ప్రాణాలు పోయే వరకు వచ్చింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సుమారు మూడు, నాలుగు నెలల క్రితం బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి పోలీసులు సన్ రూఫ్ ఓపెన్ చేసి పిల్లలు నిలబడి వెళ్లే ప్రయాణాలపై సీరియస్ అవుతున్నారు. ఇకపై అలా వెళ్లే వారికి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇకపై కారు సన్ రూఫ్ ఓపెన్ చేసి ప్రయాణించే ఘటనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. పిల్లలు నిలబడి ఉండగా, కారు దూసుకెళ్లడాన్ని నేరంగా పరిగణిస్తామని చెప్పారు. పిల్లల సేఫ్టీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. బైక్ మీద వెళ్లినా పిల్లలకు హెల్మెట్ పెట్టాలని సూచించారు. కదులుతున్న బైక్ మీద అసురక్షితంగా కూర్చోవడానికి అనుమతించడం వల్ల వారి ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందన్నారు.
కదులుతున్న వాహనాల నుండి పడిపోవడం, ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలు, పిల్లలకు తీవ్ర గాయాలయ్యేలా చేస్తున్నాయన్నారు. హెల్మెట్ లేకుండా పిల్లలను బైక్ మీద తీసుకెళ్తే.. MV చట్టం సెక్షన్ 184 ప్రకారం ప్రమాదకరమైన డ్రైవింగ్ గా భావించి రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Read Also: టయోటా To టాటా.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్ ఈవీ కార్లు ఇవే!
ప్రమాదాలు లేకుండా సురక్షితంగా ప్రయాణాలు చేయాలంటే, కారు లోపల పిల్లలందరూ సీట్ బెల్ట్ లు ధరించేలా చూసుకోవాలి. సన్ రూఫ్ ఓపెన్ చేసి పిల్లలను నిలబడటానికి ఎప్పుడూ అనుమతించకూడదు. ద్విచక్ర వాహనాలపై, పిల్లలు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. వాహనదారుల భద్రతా నిర్ణయాలు పిల్లలను రక్షిస్తాయని పోలీసులు తెలిపారు. సురక్షితంగా డ్రైవ్ చేయడంతో పాటు పిల్లలను రక్షించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also: మెర్సిడెస్ బెంజ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ వ్యాన్.. వామ్మో ఒకే ఛార్జ్ తో అంత దూరం వెళ్తుందా?