Bhatti Vikramarka: కేంద్ర బడ్జెట్ 2026పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేశామని, కానీ ఆశించిన స్థాయిలో ఒక్క పైసా కూడా కేటాయించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏమి తప్పు చేసిందని నిధులు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడమేనని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్ విస్తరణకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. దేశానికి ఫార్మా హబ్, ఎలక్ట్రానిక్స్ హబ్గా ఉన్న హైదరాబాద్ను కేంద్రం విస్మరించిందని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్లో తాము రిలీజ్ చేసిన విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా ప్రోత్సాహం అందించాల్సింది పోయి, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మెడికల్ హబ్గా గుర్తింపు పొందిందని, విదేశాల నుంచి ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారని భట్టి గుర్తుచేశారు. కానీ మెడికల్ టూరిజం డెవలప్మెంట్ ప్లాన్లో హైదరాబాద్ను పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అలాగే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఉన్నా, సమ్మక్క-సారక్క జాతరకు విదేశీయులు వస్తున్నా, పర్యాటక అభివృద్ధిలో తెలంగాణకు చోటు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మాట్లాడిన కేంద్రం, తెలంగాణలోని సత్తుపల్లి, రామగుండం, సింగరేణి ప్రాంతాల్లో లభించే స్కాండియం, లిథియం వంటి నిక్షేపాలను పట్టించుకోలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సెమీ కండక్టర్ పార్క్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్ను కాదని వేరే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. కేవలం మూడు హై-స్పీడ్ రైళ్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.
బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం గురించి కనీస ప్రస్తావన లేదని, గ్రామీణ పేదలకు ఉపయోగపడే వీబీ జీ రామ్ జీ పథకాన్ని ఉపాధి హామీ నుంచి తొలగించడం వల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2047 లక్ష్యంతో తెలంగాణ ముందుకు వెళ్తుంటే కేంద్రం మాత్రం వెన్నుపోటు పొడుస్తోందని, రాష్ట్ర ఎంపీలు పార్టీలకతీతంగా పార్లమెంటులో పోరాడాలని పిలుపునిచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ గురించి ప్రస్తావిస్తూ, ఇది కక్ష సాధింపు చర్య కాదని, అత్యంత పారదర్శకమైన విచారణ అని భట్టి స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ను సామాన్య వ్యక్తులపై వాడారన్న ఫిర్యాదుల మేరకే విచారణ జరుగుతోందని చెప్పారు. విచారణ ప్రక్రియను ప్రభావితం చేసేలా తాము ఎలాంటి కామెంట్ చేయబోమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.