BRS : కల్వకుంట్ల కుటుంబంలో ముసలం పుట్టింది. అది బ్లాస్ట్ అయ్యేందుకు రెడీగా ఉంది. కవిత తగ్గేదేలే అంటున్నారు. కేటీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. హరీశ్రావు తన సపోర్ట్ బావమరిదికే అంటున్నారు. ఇంటిపెద్ద కేసీఆర్కు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు కూతురును కాదనలేరు.. ఇటు కొడుకు స్థాయిని తగ్గించలేరు. ఇప్పటికే పార్టీ నుంచి కవిత దూరంగా ఉంటున్నారు. జాగృతితోనే రాజకీయ ఉనికి చాటుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం కవితక్కతో టచ్ మీ నాట్ అంటున్నారు. బీసీ నినాదం, ఫూలే విగ్రహం, సామాజిక తెలంగాణే లక్ష్యంగా కవిత దూకుడు పెంచారు. రేపో మాపో కవిత కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారమైతే జోరుగా సాగుతోంది. అదే జరిగితే గులాబీ దళం రెండు ముక్కలుగా చీలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవన్నీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ గురించి జరుగుతున్న ప్రచారం. అయితే, ఇదంతా నిజమే అంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి.
కవితకు కాంగ్రెస్ వెల్కమ్
ఆర్నెళ్లు జైల్లో ఉన్నా.. తనను ఇంకా ఎందుకు కష్టపెడుతున్నారంటూ ఇటీవలే కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను రెచ్చగొడితే మరింత బలంగా మారుతానంటూ తేల్చి చెప్పారు. కవిత కామెంట్స్ కేటీఆర్ గురించేనని అంతా అంటున్నారు. వారిద్దరి ఆధిపత్య పోరుతో విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. అయితే, కవిత ఈ మధ్య చాలా వాస్తవాలు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి మరింత కలకలం రేపారు. తనను ఏకాకి చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆవేదన కవితలో కనిపిస్తోందన్నారు. ఇంటి వాళ్లే కక్ష కట్టి ఆ పని చేస్తున్నారని చెప్పారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ప్రచారం జరుగుతోందని.. కాంగ్రెస్ పార్టీ తరఫున తాము స్వాగతిస్తామని తెలిపారు.
కేసీఆర్కు కవిత లెటర్!
తన అసంతృప్తి వెల్లడిస్తూ కేసీఆర్కి కవిత ఇటీవలే లేఖ రాశారని సామ చెప్పారు. పార్టీలో గుర్తింపు లేకుండా పోతోందనే ఆవేదన ఆ లేఖలో ఉందన్నారు. కుటుంబంలోని అంతర్గగా అంశాలు లేఖలో ఉన్నాయని వెల్లడించారు. ఒకవేళ కవిత ఆ లేఖను తాను రాయలేదని చెబితే.. తానే ఆ వివరాలు బయట పెడతానని ప్రకటించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్రెడ్డి.