Congress vs BRS: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాజేష్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఆయన బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులకు, సర్పంచ్ అభ్యర్థులకు పాడి కౌశిక్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా మారారని అనిరుధ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు చేతిలో పురుగుల మందు (ఇండ్రిన్) సీసాలు పట్టుకుని, “తమను గెలిపించకపోతే చచ్చిపోతాం” అంటూ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని, అందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డికి అనిరుధ్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. “ప్రజల కోసం, పేదల కోసం నేను ఇండ్రిన్ సీసా పట్టుకుని కూర్చోవడానికి సిద్ధం.. నువ్వు కూడా అలా కూర్చోగలవా?” అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఇప్పుడు కాళ్లు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు.. గెలిచాక జుట్టు పట్టుకుంటారని ప్రజలను హెచ్చరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటంతో రైతులు వాటిని పొలాల్లో పందులు రాకుండా కంచెలుగా వాడుకున్నారని, కానీ కాంగ్రెస్ ఇస్తున్న ఇందిరమ్మ చీరలు నాణ్యంగా ఉన్నాయని ప్రజలే చెబుతున్నారని అనిరుధ్ పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
Read Also: Telangana: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్..