jagga reddy: సంగారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం స్థానికంగా మంచి స్పందన తెచ్చుకుంటోంది. చిన్నారుల మొఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో.. తాజాగా ఆయన మరో 70 మంది చిన్నారులకు స్వయంగా సైకిళ్లను అందజేశారు. ముఖ్యంగా 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నపిల్లల కోసమే ఈ విడత కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం విశేషం.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు సంగారెడ్డిలో మొత్తం 400 మంది పిల్లలకు సైకిళ్లను పంపిణీ చేశామని చెప్పారు. తమ కార్యాలయానికి వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి, పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఖచ్చితంగా సైకిళ్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే, సైకిళ్ల కోసం ముందే పేర్లు నమోదు చేసుకున్న మరో 156 మంది చిన్నారులకు జగ్గారెడ్డి టోకెన్లను పంపిణీ చేశారు. వీరందరికీ వచ్చే ఆదివారం సైకిళ్లను అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక కార్యక్రమం జరిగేంత సేపూ జగ్గారెడ్డి అక్కడికి వచ్చిన చిన్నారులతో ఎంతో సరదాగా గడిపారు. వారితో ముచ్చటిస్తూ, షేక్హ్యాండ్స్ ఇస్తూ, ‘హాయ్’ చెప్తూ పిల్లలతో పిల్లలైపోయారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు కూన సంతోష్, సుదీప్ తదితరులు పాల్గొని జగ్గారెడ్డితో పాటు పిల్లలకు సైకిళ్లను అందజేశారు. స్థానిక నేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో అటు పిల్లలు, ఇటు వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆడబిడ్డల కోసం రేవంత్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. 2034 నాటికి కోటీశ్వరులు!