Supreme Court: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. యాదాద్రి, వరంగల్ హైవే విస్తరణ కోసం భూములిచ్చిన వారికి.. పెంచిన నష్టపరిహారం ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. అవసరమైతే భూ యజమానులు పెంచిన నష్టపరిహారాన్ని విత్ డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా కొనసాగేలా సుప్రీంకోర్టు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లైంది.
యాదాద్రి – వరంగల్ హైవే ప్రాజెక్ట్ కు సంబంధించిన భూ సేకరణ విషయంలో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రకటించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఆ తరువాత పెంచింది. అయితే, దీనిపై నేషనల్ హైవే అథారిటీ హైకోర్టుకు వెళ్లింది. అదే సమయంలో భూ యజమానులు కూడా కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు భూ యజమానులకు పెంచిన నష్టపరిహారాన్ని అందచేయాలని తీర్పునిచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని NHAI అభ్యర్థించింది. సోమవారం కేసును విచారించిన సుప్రీం కోర్టు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. భూ యజమానులు ఇప్పటికే తమ భూములను కోల్పోయిన నేపథ్యంలో వారికి న్యాయపరమైన పరిహారం అందాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అవసరమనుకున్న పక్షంలో కోర్టు విధించిన షరతులకు లోబడి పెంచిన పరిహారాన్ని భూ యజమానులు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
Also Read: Ind vs Pak: పాకిస్తాన్ తో కపిల్ దేవ్ ఫిక్సింగ్…BMW కారుకు అమ్ముడుపోయాడంటూ ఆరోపణలు !
అయితే నగదు విత్ డ్రా చేసుకుంటే తర్వాత రికవరీ కష్టమన్న నేషనల్ హవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేవలం ఆర్థిక భారాన్ని సాకుగా చూపించి బాధితులకు అందాల్సిన న్యాయపరమైన పరిహారాన్ని ఆపలేరని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు యథాతథంగా ఉంచినట్లైంది. ఈ తీర్పుతో భూ సేకరణ ప్రక్రియలో భూ యజమానులకు ఊరట లభించినట్లు అయ్యింది.
Also Read: Viral Video: 22 ఏళ్లకే ఆరోసారి ప్రెగ్నెంట్.. 5 గురు ఉన్నా మగబిడ్డకోసం ఆరాటం.. డాక్టర్ రియాక్షన్ ఇదే!