Jagga Reddy: పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగడం లేదని, కేవలం రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల చరిత్రను చెరిపివేయడానికే.. ప్రస్తుతం పార్లమెంట్లో చర్చలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
పేదల అభ్యున్నతి, ప్రజల సంక్షేమం, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగడం లేదని జగ్గారెడ్డి అన్నారు. 11 ఏండ్ల బీజేపీ పాలనపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలపై చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా.. సభా వ్యవహారాలు నడపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను సభలో ప్రియాంక గాంధీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదని విమర్శించారు.
రామ్ మందిర్–బాబ్రీ మసీదు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతల పేర్లను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు.
మహాత్మా గాంధీ శాంతియుతంగా సత్యాగ్రహ పోరాటం చేసి, దేశానికి స్వేచ్ఛ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. 1930లో దేశ ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనే లక్ష్యంతో గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. అప్పట్లో “రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం” అని గాంధీజీ పలికిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ పార్టీ లేదు, మోదీ–అమిత్ షాలు కూడా పుట్టలేదని వ్యాఖ్యానించారు. అలాంటి వారు నేడు గాంధీ, నెహ్రు లాంటి మహానుభావులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు మోదీ ప్రధాని అయ్యారని, కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చిన చట్టాల వల్లే అమిత్ షా హోంమంత్రి అయ్యారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం కృతఘ్నతకు నిదర్శనమని విమర్శించారు. దేశ ప్రజలను టార్గెట్ చేయమని బీజేపీకి అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు.
బీజేపీ భవిష్యత్తులో వందేమాతరం, జనగణమన వంటి జాతీయ గీతాలకూ భంగం కలిగించే ప్రయత్నం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించేందుకు జనవరిలో సంగారెడ్డిలో భారీ సభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో లక్ష మందితో సభ పెడతానని, ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించనని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలను ప్రజలకు తెలియజేయడానికే ఈ సభ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
Also Read: ఈ నెల 22 వరకు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, చెక్ చేసుకోపోతే బుక్కైపోతారు
జవహర్లాల్ నెహ్రు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను సంగారెడ్డి ప్రజలకు వివరంగా చెబుతానని జగ్గారెడ్డి అన్నారు. దేశ ప్రజలు బీజేపీ వైఖరిని గమనించి, ఎందుకు అధికారంలోకి తెచ్చామో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.