Jaggareddy: AICC తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో తన భేటీపై వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టత ఇచ్చారు. దాదాపు 6-7 నెలల తర్వాత తాను స్వయంగా అపాయింట్మెంట్ అడిగి ఆమెను కలిశానని, ఈ భేటీ కేవలం 10 నిమిషాలు మాత్రమే సాగిందని తెలిపారు. దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఎవరిపైనా ఫిర్యాదులు చేయడానికి తాను వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతం కోసమే చర్చ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో, పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే ప్రధానంగా చర్చించామని జగ్గారెడ్డి వివరించారు. రాబోయే 6 నెలల నుంచి ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమని, ఎన్నికల సంవత్సరం సమీపిస్తున్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు చేపడుతున్న కార్యక్రమాలకు అదనపు బలం చేకూర్చేలా అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి
గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు నాయకులు, కార్యకర్తలను ఒక టీమ్గా సమన్వయం చేయాలని ఇన్చార్జ్కు సూచించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ కొందరు కార్యకర్తలు గుర్తింపు కోసం ఎదురుచూస్తూ పార్టీ వ్యవస్థకు దూరంగా ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి కలుపుకుపోవాలని కోరారు.
అది కాంగ్రెస్ సంస్కృతి
తనకు ఎవరిపైనా వ్యక్తిగత ఫిర్యాదులు చేసే అలవాటు లేదని, ఈ భేటీలో ఎవరి పేర్లూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు, చర్చలు, వాదోపవాదాలు సహజమని.. ప్రజల సమస్యలు, తమ వర్గాల ప్రతినిధిత్వం కోసమే నాయకులు మాట్లాడతారని చెప్పారు. ఇది పార్టీ అంతర్గత సంస్కృతి అని, కాబట్టి మీడియా ఈ భేటీకి అనవసర రాజకీయ అర్థాలు తీయవద్దని జగ్గారెడ్డి హితవు పలికారు.
Also Read: ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!