జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య ఎడతెగని ఆధిపత్య పోరు చివరకు కేంద్ర ఎన్నికల సంఘం గడప తొక్కింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్.. ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది.
ఎమ్మెల్యేపై ఈసీకి ఫిర్యాదు..
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, రాయికల్ ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి (EC) లేఖ రాశారు. ఒకే పార్టీలో ఉంటూ.. స్వపక్ష ఎమ్మెల్యేపైనే సీనియర్ నేత ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి సంజయ్ చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.
మున్సిపల్ టికెట్ల రచ్చ..
ఈ వివాదానికి ప్రధాన సమస్య మున్సిపల్ టికెట్ల కేటాయింపు. సంజయ్ వర్గానికి మెజారిటీ టికెట్లు ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని భావిస్తున్న ఆయన, తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపడమే కాకుండా, వారికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. ‘నేను అసలైన కాంగ్రెస్ వాదిని.. వలస వచ్చిన వారికి పెద్దపీట వేయడం ఏంటి?’ అన్నది జీవన్ రెడ్డి వాదన. దీనికి ప్రతిగా, తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని సంజయ్ కౌంటర్ ఇస్తున్నారు.
జీవన్ రెడ్డి వైఖరిపై కాంగ్రెస్ అధిష్టానం కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఈసీకి ఫిర్యాదు చేయడం వంటి చర్యలను సీరియస్గా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత జీవన్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఈ అంతర్గత పోరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కేడర్ ఆందోళన చెందుతోంది. జగిత్యాల కోటలో పైచేయి ఎవరిదో తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
ALSO READ: Uttam Kumar Reddy: రేపే మున్సిపల్ పోలింగ్.. పట్టణ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ ఇచ్చిన గ్యారెంటీలు ఇవే!