Srinivas Goud: ఎన్నికలను నిస్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు రాజ్యాంగం స్పష్టమైన నియమావళిని రూపొందించిందని, అయితే రాష్ట్రంలో ముఖ్యంగా (Mahabubnagar District) మహబూబ్నగర్ జిల్లాలో ఆ నియమాలు అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) నేత శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని భారత రాష్ట్ర సమితి క్యాంపు కార్యాలయంలో ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉండగా, జిల్లాలో మాత్రం పోలీస్ అధికారులే అన్ని శాఖల పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని, కానీ కొందరు అధికారుల వైఖరితో ఆ ప్రతిష్టకు మచ్చ పడుతోందన్నారు. పోస్టింగ్లు, ఇతర ప్రయోజనాల కోసం కొందరు అధికారులు పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు.
నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థుల వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలను అనుమతిస్తూ, బీఆర్ఎస్(BRS) అభ్యర్థుల వెంట మాత్రం నిబంధనల పేరుతో కేవల ముగ్గురినఅనుమతిస్తున్నారని తెలిపారు. అలాగే నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిళ్లు తీసుకువచ్చే పరిస్థితులు నెలకొన్నాయని, వేధింపులు తట్టుకోలేక జిల్లాల్లో ఆత్మహత్యల వరకూ వెళ్లిన ఘటనలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరమన్నారు. సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం మహబూబ్నగర్లో లేకుండా పోయిందని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే, అంతా పోలీసులే చేస్తున్నారని, తమకు తెలియదని చెప్పడం బాధాకరమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ లేదని మాట్లాడుతున్న వారు, అదే పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
Also Read: Srinivas Goud: దేవుడి సన్నిధిలో విద్వేష వ్యాఖ్యలు.. శ్రీనివాస్ గౌడ్పై టీటీడీ చర్యలు?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శించుకుంటూనే, ఇక్కడ మాత్రం కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉందన్నారు. పోలీసుల అణచివేత చర్యలను ప్రజలు ఎప్పటికీ హర్షించరని, తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తున్నామని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ఆధారాలతో సహా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లకు వెళ్లి బెదిరింపులు చేయడం, వ్యాపారాలు నడవనివ్వమని హెచ్చరించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోకపోతే, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఒక పార్టీకి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని పోలీసులు బెదిరించి మాట మార్చేలా చేయడం తీవ్ర అన్యాయమన్నారు. ఇలాంటి అరాచక శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, పోలీసుల తీరు మారకపోతే ఉద్యమాలు పెద్ద స్థాయిలో ప్రారంభమవుతాయని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యాయవాదులు బెక్కం జనార్దన్, మనోహర్, కరుణాకర్ గౌడ్, స్వదేశ్, మురళి, ఉమామహేశ్వరి, రవిప్రకాష్, శ్రీహరి, రాంనాథ్ గౌడ్, శ్రీరామ్ కుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mahabubabad: మహబూబాబాద్లో కిరాతకం.. నిద్రిస్తున్న అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన అల్లుడు!