జగిత్యాల రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ అలాగే మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి అలికాని బుజ్జగించేందుకు పార్టీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి బుధవారం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. తనను విస్మరిస్తున్న తీరుపై జీవన్ రెడ్డి తన ఆవేదనను ఈ సమావేశంలో వెళ్లగక్కారు.
నాయకత్వం ఆదేశాల మేరకే తాను ఇక్కడికి వచ్చినట్లు కత్తి వెంకటస్వామి స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు పార్టీకి అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని కోల్పోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆయన వివరించారు. జీవన్ రెడ్డి మనసులో ఉన్న అసంతృప్తిని.. ఆవేదనను నేరుగా విని అర్థం చేసుకున్నట్లు తెలిపారు. పార్టీలో ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ భేటీ అనంతరం కత్తి వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి గారు ఎంతో బాధలో ఉన్నారని.. ఆయన వెలిబుచ్చిన అంశాలను తూచా తప్పకుండా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాజకీయాల్లో చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించి జీవన్ రెడ్డిని దారికి తెచ్చే బాధ్యతను అధిష్టానం తనపై ఉంచిందని ఆయన వెల్లడించారు.
స్థానిక రాజకీయ సమీకరణాల వల్ల జీవన్ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం.. తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందనే చర్చ సాగుతుండగా.. అధిష్టానం దూత రాకతో పరిస్థితి కొంత సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది. అయితే జీవన్ రెడ్డి మనసు మార్చుకుని మళ్లీ యాక్టివ్ అవుతారా లేదా అనేది అధిష్టానం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంది.