Jagtial district Metpally News: జగిత్యాల జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కవలలు పుట్టడమే అరుదు అనుకుంటే.. ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మెట్పల్లి మండలానికి చెందిన ఓ దంపతులకు మొదటి సంతానంలోనే ముగ్గురు పిల్లలు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలోని రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన జంగిటి రాజలక్ష్మి – నరేందర్ దంపతులకు ఇదే మొదటి సంతానం. నెలలు నిండిన రాజలక్ష్మిని.. కుటుంబ సభ్యులు మెట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ పూర్తి చేశారు. అయితే.. ఈ ప్రసవంలో రాజలక్ష్మి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన వారిలో.. ఒక బాబు, ఇద్దరు పాపలు ఉండటం ఆ దంపతుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుట్టిన ముగ్గురు పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు. బాబు బరువు 1.8 కేజీలు ఉండగా, మొదటి పాప బరువు 1.5 కేజీలు, రెండో పాప బరువు 1.4 కేజీలుగా తెలిపారు. ఒకే సారి ముగ్గురు పిల్లలు జన్మించడం వల్ల వారు కొద్దిగా తక్కువ బరువుతో పుట్టారని తెలిపారు. ప్రస్తుతం తల్లీపిల్లలు అందరూ క్షేమంగా ఉన్నప్పటికీ, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పీడియాట్రిషియన్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల టీమ్ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read: కీసర 108 సిబ్బంది చేసిన పనికి ప్రశంసల జల్లు.. ఎం చేశారంటే?
వివాహం తర్వాత మొదటి సంతానంలోనే ఏకంగా ముగ్గురు బిడ్డలు పుట్టడంతో రాజలక్ష్మి – నరేందర్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు, స్థానికులు ఆసుపత్రికి చేరుకుని వారికి శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు సైతం తల్లీపిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.