జగిత్యాల పట్టణంలో వెలుగుచూసిన ఈ ఆహార కల్తీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా పలువురు ఆసుపత్రి పాలవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో గల శివ సాయి టిఫిన్ సెంటర్ లో శుక్రవారం ఉదయం భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. బుగ్గారం గ్రామానికి చెందిన ఒక మహిళ టిఫిన్ చేయడానికి ఈ హోటల్కు వచ్చింది. ఆమె దోస ఆర్డర్ ఇచ్చి తింటున్న సమయంలో.. చట్నీలో చనిపోయి ఉన్న బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురైంది. అప్పటికే కొంత ఆహారం తీసుకున్న ఆ మహిళకు వెంటనే వాంతులు మొదలై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
బల్లిని చూసిన వెంటనే సదరు మహిళ హోటల్ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెతో పాటు అదే సమయంలో అక్కడ టిఫిన్ తిన్న మరికొందరు కూడా అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 12 మంది బాధితులు ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం వారందరికీ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ హోటల్పై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో టిఫిన్లలో బొద్దింకలు వచ్చాయని.. ఆ సమయంలోనూ వినియోగదారులు ఆందోళన చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో హోటల్ యాజమాన్యం తమ తప్పును ఒప్పుకోకుండా, తనిఖీకి వచ్చిన అధికారులపైనే నెపాన్ని నెట్టేసి తప్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ఆహార భద్రత అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నిర్వాహకులు బరితెగిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
జగిత్యాల వంటి రద్దీ ప్రాంతాల్లోని హోటళ్లలో కనీస శుభ్రత పాటించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్నీలు, సాంబార్ వంటి పదార్థాల తయారీలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ ఘటనపై ఆహార భద్రత విభాగం అధికారులు తక్షణమే స్పందించి, సదరు హోటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ రద్దు చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Krishna – Godavari: తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం.. కేంద్రం సంచలన నిర్ణయం..
చట్నీలో బల్లి
జగిత్యాల తాసిల్ చౌరస్తాలోని శివ సాయి టిఫిన్ సెంటర్ లో ఘటన
టిఫిన్ చేసిన 8 మందికి అస్వస్థత
చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/W2HM5fXL6Y
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026