Nakka Indaiah: జగిత్యాల జిల్లాలో వెలుగుచూసిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి, ఆలోచనకు గురిచేస్తోంది. మరణం అనేది ఎప్పుడో ఒకప్పుడు తలుపు తడుతుందని తెలిసినా, దాని కోసం ఒక పండుగలా సిద్ధపడిన వ్యక్తి నక్క ఇందయ్య (అలియాస్ జాన్). తన అంతిమ యాత్ర ఎవరికీ భారం కాకూడదని భావించి, 15 ఏళ్ల ముందే తన ‘శాశ్వత గృహాన్ని’ నిర్మించుకున్న ఆయన జీవన ప్రయాణం స్ఫూర్తిదాయకం.
ఇందయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలై స్థిరపడ్డారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందయ్య, కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తండ్రి మరణవార్తతో కుటుంబం శోకసముద్రంలో మునిగినా, ఆయన ఆఖరి కోరికను గౌరవించాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల క్రితం ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్న ఆ రాతి సమాధి వద్దే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇందయ్య పెద్దగా చదువుకోలేదు. కానీ, ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం అసాధారణమైనది. పొట్టకూటి కోసం సాధారణ కార్మికుడిగా దుబాయ్ వెళ్లిన ఆయన, అక్కడ కేవలం కూలి పనులకే పరిమితం కాలేదు. తన కష్టార్జితంతో ఏకంగా ఒక కంపెనీని స్థాపించి, ఎంతోమందికి ఉపాధి కల్పించి అన్నం పెట్టాడు. విదేశాల్లో సంపాదించిన తర్వాత తిరిగి తన సొంత గ్రామానికి వచ్చి, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందారు.
ఇందయ్య ఆలోచనలు లోకానికి చాలా భిన్నంగా ఉండేవి. మరణం తర్వాత తన పిల్లలు ఆరడుగుల నేల కోసం వెతకకూడదని, తన అంత్యక్రియల ఖర్చు ఎవరికీ భారం కాకూడదని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే 2009లో సుమారు రూ. 8 లక్షల భారీ ఖర్చుతో గ్రామ శివారులోని తన సొంత భూమిలో ఒక పటిష్టమైన రాతి సమాధిని నిర్మించుకున్నాడు. అంతటితో ఆగకుండా, ప్రతిరోజూ ఆ సమాధి వద్దకు వెళ్లి కాసేపు గడిపేవాడు. “నేను చనిపోయాక నన్ను ఇక్కడే నిద్రపుచ్చాలి” అని తన కుటుంబ సభ్యులకు ఎప్పుడో వీలునామా రాసిపెట్టాడు.
చదువు లేకపోయినా బతుకులోని అసలైన సత్యాన్ని ఇందయ్య ఒంటబట్టించుకున్నారని గ్రామస్థులు కొనియాడుతున్నారు. మరణాన్ని ఒక భయంలా కాకుండా, జీవితంలో అది కూడా ఒక భాగమని నమ్మి, తన అంతిమ యాత్రను కూడా ఒక క్రమశిక్షణతో ప్లాన్ చేసుకున్న ఇందయ్య కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. తేదీ, సమయం ఇదే?