Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన-బీజేపీ (BJP) మధ్య పొత్తు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. (Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు, తెలంగాణ మున్సిపల్ బరిలో మాత్రం విలక్షణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మున్సిపల్ న్నికల్లో జనసేన మద్దతు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని బీజేపీ నేతలు పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే (Bjp) బీజేపీలో టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఆపై వారు జనసేనలో చేరారు. కమలం పార్టీ టికెట్ నిరాకరించిన చోట, వారు పలు ప్రాంతాల్లో జనసేనాని ఆశీస్సులతో బరిలోకి దిగినట్లు సమాచారం. బీజేపీ నుంచి జనసేనలో చేరిన వారిలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాకు నేతలున్నట్లు సమాచారం. కాగా వారికి జనసేన టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ అంశం బీజేపీకి ఏమాత్రం మింగుడుపడటం లేదని సమాచారం. దీనివల్ల క్షేత్రస్థాయిలో బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి తెలంగాణ బీజేపీ నేతలు జనసేన మద్దతు కోరడంపై ఓ వర్గం శ్రేణులు సైతం వ్యతిరేకించాయి.
తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. కాగా ప్రచారం కోసం మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది. అయితే పవన్ పార్టీ సైతం పలు కీలక స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. అందులోనూ బీజేపీ వీడిని వారికి పలుచోట్ల జనసేన టికెట్లు ఇవ్వడం కాషాయ పార్టీని మరింత డైలమాలో పడేసింది. ఈ ఇష్యూ ఇప్పుడు కమలదళానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్లయింది. ఇదిలా ఉండగా జనసేన మద్దతు వల్ల ఒరిగే లాభం కంటే, వారు పోటీలో ఉండటం వల్ల కలిగే నష్టమే ఎక్కువని బీజేపీలోని ఒక వర్గం నాయకులు భావిస్తున్నారు. ఓట్లు చీలిపోవడం వల్ల ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రయోజనం చేకూరుతుందని పలువురు చెబుతున్నారు.
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా జనసేన మొత్తం దాదాపు 345 స్థానాల్లో పోటీ చేయనుంది. నిజామాబాద్ లో 45 స్థానాలకు, నల్లగొండలో 60, కరీంనగర్ లో 65, అదిలాబాద్ లో 38, మహబూబ్ నగర్ లో 30, రంగారెడ్డి జిల్లాలో 21, మెదక్ లో 20, వరంగల్ లో 30 స్థానాల్లో బరిలో ఉంది. మిగతా జిల్లాల్లోనూ పలు స్థానాల్లో జనసేన బరిలో ఉంది. కాగా బీజేపీ సైతం అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేనతో పాటు బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం చేయనున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో ఆయన పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టనున్నారు. జనసేన బరిలో లేని ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడం ఒకే. కానీ.., జనసేన, బీజేపీ బరిలో ఉన్న ప్రాంతాల్లో పవన్ ఎవరి తరుపున ప్రచారం చేస్తారనేది మిలియన డాలర్ల ప్రశ్నగా మారింది. జనసేనకు ఓటేయమంటారా? లేక కాషాయ పార్టీకా? అనేది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నగా మారింది.
ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు తెలంగాణ వ్యతిరేకి అయిన ఆంధ్రపార్టీ లీడర్ ను మద్దతు కోరడంపై బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను సైతం వినియోగించుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండటం కమలదళానికి కష్టంగా మారింది. ఇకపోతే.. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రచార తేదీలు ఖరారైనా ఎక్కడి నుంచి తన ప్రచారాన్ని మొదలుపెడతారనే అంశంపై క్లారిటీ రాలేదు. పవన్ తో ప్రచారం ఎక్కడి నుంచి మొదలెట్టాలనేది అటు కాషాయ పార్టీకి కూడా అంతుచిక్కడంలేదని తెలుస్తోంది. ఇప్పుడున్న తలనొప్పులతో జనసేనానిని ప్రచారానికి తీసుకురావాలా? వద్దా? అనే డైలమాలో కాషాయ పార్టీ పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి మున్సిపల్ కురుక్షేత్రంలో అటు మిత్రధర్మం పాటించాలా? ఇటు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలా? అనే అంశంపై బీజేపీకి, జనసేనకు ఫజిల్ లా మారింది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారిన అంశంపై ఇరు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది వేచి చూడాల్సిందే.