Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం ఒక్కసారిగా ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.
మున్సిపల్ పోరులో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలాఖరుకు స్వదేశానికి చేరుకోనున్నారు. అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే, అంటే ఫిబ్రవరి 3 నుంచి ఆయన రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రచారాన్ని ప్రారంభించి, వరుసగా జగిత్యాల, చేవెళ్ల, భూపాలపల్లి, మెదక్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ అభ్యర్థుల విజయానికి ఈ పర్యటనలు కీలకం కానున్నాయి.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఫిబ్రవరి 14న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అత్యంత కీలకమైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి 16న పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో వార్డుల స్థాయిలో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది, ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఓటరు ఎటు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
Read Also: తెలంగాణపై కేంద్రం పక్షపాతం వీడాలి.. బడ్జెట్లో న్యాయం చేయాలి!: ఎంపీ చామల