Jana Sena And BJP: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించే దిశగా జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల బరిలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి సాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని ఆయన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) కలిశారు.
ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కేవలం మద్దతుకే పరిమితం కాకుండా, పార్టీ అభ్యర్థుల తరపున తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు విపక్ష ఓట్లు చీలిపోకుండా ఉమ్మడి కార్యచరణతో ముందుకు వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించాల్సిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఈ కలయికతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జనసేన మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jana Sena Plenary: పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ.. పార్టీ విస్తరణ, అజెండాతో ప్లీనరీ