![Jayasudha joining in BJP Jayasudha joining in BJP](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/07/JAYASUDHA-INSIDE-ARTICAL-IMAGE.jpg)
Jayasudha joining in BJP(Telangana BJP news today) : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల మాత్రమే సమయం ఉంది . రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. కాంగ్రెస్ బలం రోజుకురోజుకు పెరుగుతోంది. చాలామంది నేతలు హస్తంగూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు.
కర్ణాటకలో ఓటమి ప్రభావం బీజేపీపై పడింది. తెలంగాణలో ఒక్కసారి పార్టీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీలో చేరేందుకు నేతలెవరూ ఆసక్తి చూపడంలేదు. మరోవైపు మరికొందరు కీలక నేతలు కాషాయ జెండాను వదిలేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. చేరికలపై దృష్టి పెట్టింది.
ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి పార్టీలో చేరికలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధతో కిషన్ రెడ్డి భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే జయసుధ.. అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఆమె ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.
2009లో జయసుధ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. 2016లో టీడీపీలో చేరి 2019 వరకు ఉన్నారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ పార్టీలో 2022 వరకు ఉన్నారు. కొంతకాలంగా జయసుధ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఇప్పుడు బీజేపీ నుంచి ఆహ్వానం రావడంతో కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో కొందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలకు కాషాయ కండువాలు కప్పే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ ఛైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి బీజేపీ లో చేరతారని తెలుస్తోంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవరావు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని టాక్ నడుస్తోంది. ఈ నేతలతో ఇప్పిటికే బీజేపీ నేత వివేక్ చర్చలు జరపడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.