తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని.. పార్టీ పెట్టిన భిక్షతోనే అత్యున్నత పదవులు అనుభవించిన నాయకుడు ఇలాంటి సమయంలో పార్టీని వీడటంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అన్యాయం ఏంటని సామాన్య కార్యకర్తలు నిలదీస్తున్నారు. దేశంలోనే మరే ఇతర నాయకుడికి లేని విధంగా అత్యధిక సార్లు బీ-ఫారాలు అందుకున్న ఘనత మీదే కదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
పదవుల ప్రస్థానం.. పార్టీ ఇచ్చిన ప్రోత్సాహం
జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆయనకు కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అర్థమవుతుంది. మొత్తం 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు బీ-ఫారం ఇచ్చింది. అందులో ఐదుసార్లు విజయం సాధించగా.. మంత్రిగా పని చేసే అరుదైన అవకాశం కూడా దక్కింది. కేవలం అసెంబ్లీకే పరిమితం కాకుండా మూడు సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆ మూడు ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలైనప్పటికీ పార్టీ ఏనాడూ ఆయనను పక్కన పెట్టలేదు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా బి-ఫారం ఇచ్చి పెద్దల సభకు పంపింది. ఇలా మొత్తం 15 సార్లు పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఆయనపై అధిష్టానానికి ఉన్న నమ్మకం ఎంతో స్పష్టమవుతోంది.
ఓడినా వీడని అవకాశం.. అయినా అసంతృప్తి ఎందుకు?
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. ఓడిపోయిన ఆరు నెలల కాలంలోనే మళ్లీ ఎంపీగా పోటీ చేసే బంపర్ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్. అక్కడ కూడా ప్రజలు ఆయనను తిరస్కరించినప్పటికీ పార్టీ గౌరవం తగ్గకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగాలని సూచించింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో ఆశించి పార్టీ మారడం ఎంతవరకు సమంజసమని కేడర్ ప్రశ్నిస్తోంది. పదవుల కోసం పాకులాడే తత్వం ఉన్న నాయకుడికి సిద్ధాంతాలు ఉండవా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
బీఆర్ఎస్ లో చేరికపై అనుమానాలు.. కార్యకర్తల సూటి ప్రశ్నలు
రేపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఆశించిన పదవులు రాకపోతే జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లడం రాజకీయాల్లో సహజమే అయినా.. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఇలా చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ అక్కడ ప్రాధాన్యత తగ్గితే మళ్లీ కాంగ్రెస్ తలుపు తడతారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే దశాబ్దాల బంధాన్ని తెంచుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కష్టకాలంలో పార్టీని కాపాడాల్సింది పోయి.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం నైతికత అనిపించుకోదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: పెద్దలు జీవన్ రెడ్డి ఇలా చేయొచ్చా..? అందుకే ఆయనకు పదవులు ఇవ్వలేదు, మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు