Nagarjuna Sagar: స్వేచ్ఛ బ్యూరో: కృష్ణా జలాల పంపిణీలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరోసారి తన మొండివైఖరిని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే తనకు కేటాయించిన వాటా కంటే అదనంగా నీటిని వాడుకున్న ఏపీ, ఇప్పుడు సాగర్ డెడ్ స్టోరేజీ నీటిపైనా కన్నేసింది. ఒకవైపు హైదరాబాద్ మహానగరం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే.. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. త్రిసభ్య కమిటీకి సైతం లేఖ రావడం చర్చకు దారితీసింది. అయితే ఏపీ ప్రయత్నానికి తెలంగాణ అడ్డుకుంటుందా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.
ఆంధ్రప్రదేశ్ వైఖరి మరోసారి వివాదాస్పదంగా మారింది. కృష్ణా జలాలలో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీకి కేటాయించిన వాటా పూర్తయినప్పటికీ, రకరకాల సాకులతో నీటిని తోడేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఏపీ ఇప్పటివరకు 771 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకుంది. అయినప్పటికీ, తాజాగా మరో 10 టీఎంసీలు కావాలని సాగర్ కుడికాల్వ ద్వారా విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు విన్నవించడం తెలంగాణ రైతాంగాన్ని, ప్రభుత్వాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తన వాటాకు మించి నీటిని వినియోగించుకున్నా, ఇంకా కావాలంటూ పట్టుబట్టడంపై తెలంగాణ గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ రాష్ట్ర ‘నీటి దాహం’ తీరకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ నెల 31న త్రిసభ్య కమిటీ నిర్వహించే సమావేశం అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ మాత్రం అత్యంత పొదుపుగా వాడుకుంటూ 298 టీఎంసీలను మాత్రం వినియోగించుకున్నట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం తన అత్యవసర అవసరాల నిమిత్తం కేవలం జూలై వరకు 18 టీఎంసీల నీటిని మాత్రమే కోరుతోంది.హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కేఆర్ఎంబీకి ప్రభుత్వం లేఖరాసింది. నగరం దాహం తీర్చడానికి సాగర్ డెడ్ స్టోరేజీ జలాలే దిక్కు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆయకట్టు ఎండిపోకుండా చూడాలంటే ఈ నీరు అత్యంత అవసరం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల కోసం 5 టీఎంసీలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ) నుంచి హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కోసం 13 టీఎంసీలు అవసరమని పేర్కొంది. అయితే త్రిసభ్య కమిటీలో తెలంగాణ అధికారులు కోట్లాడితేనే నీటివాటాను సాధించే అవకాశం ఉంది. ఏపీ మొండి వైఖరి వల్ల నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం అట్టడుగుకు పడిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ కోటాలో ఉన్న నీటిని కూడా ఏపీ లాగేసుకుంటే మనకు అన్యాయం జరగడం ఖాయం.
Also Read: గంటలో అమరావతి నుంచి హైదరాబాద్ ప్రయాణం, బుల్లెట్ రైలు రూట్ మ్యాప్ రెడీ!
వేసవి నేపథ్యంలో హైదరాబాద్, నల్గొండ ఉమ్మడి జిల్లాకు, ఖమ్మం తాగునీటి గండం పొంచి ఉంది. ఇప్పటికే జలాశయాల్లో మట్టాలు తగ్గుతుండటంతో, త్రిసభ్య కమిటీ నిర్ణయంపైనే కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏపీ కోరినట్లుగా వారికి నీటిని విడుదల చేస్తే, హైదరాబాద్లోని ట్యాంకులన్నీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి టీఎంసీ తెలంగాణకు అత్యంత కీలకం. ప్రస్తుతం శ్రీశైలంలో 5.27 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 28.21 టీఎంసీల నీరు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నట్లు నివేదికలు సమాచారం.
ఈ నేపథ్యంలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ తన వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధమైంది..ఏపీ ఇప్పటికే తన వాటా దాటి ఎంత నీటిని వాడిందో గణాంకాలతో సహా నిరూపించడం..సాగు కంటే తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబట్టడం..తెలంగాణకు రావాల్సిన 18 టీఎంసీలను తక్షణం విడుదల చేసేలా హామీ తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఇన్నాళ్లూ కృష్ణా బోర్డు పరిధిలోని అంశాల్లో ఏపీ పైచేయి సాధిస్తూ వస్తోంది. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ గట్టిగా తన వాదన వినిపించాల్సిన అవసరం ఉంది.రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ సర్కార్ ఎంతవరకు పోరాడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ చేస్తున్న ‘నీటి దోపిడీ’ని గణాంకాలతో సహా నిలదీయాలని అధికారులు సన్నద్ధమవుతున్నారు. గట్టి వాదనాలు వినిపిస్తారా? వాటా సాధించి గెలుస్తారా లేక చేతులెత్తేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళఏపీ ఒత్తిడికి తలొగ్గితే మాత్రం తెలంగాణ సాగు, తాగునీటి రంగాలు కుదేలవడం ఖాయం.
Also Read: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ పార్టీ ఇన్ట్సా వీడియో వైరల్.. కాంబో అదుర్స్..