Tenant Farmers: స్వేచ్ఛ బ్యూరో: జీవనోపాధి కోసం ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు. కౌలుకు తీసుకొని సాగు చేసే రైతులను బ్యాంకులు గుర్తించకపోగా కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పెరిగిన పెట్టుబడులకు డబ్బులు లేక పంట నష్టపోతే పరిహారం రాక, భీమా భరోసా లేక కౌలుదారులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకునేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా,కౌలు రైతులకు మాత్రం సాయం అందడం లేదు.దీంతో వారు ఆర్థికంగా కుంగిపోతున్నారు.
కౌలు రైతులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటేటా పెరుగుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో కౌలు దారులకు గుర్తింపు కార్డులు అందజేసింది. అప్పటి నిబంధనల ప్రకారం వారికి అందజేసి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం అధికారులు ఈ ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతో వారు ప్రభుత్వ సహకారానికి నోచుకోవడం లేదు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. స్విమ్మింగ్ పూల్లో మునిగి తెలుగు యువతి దుర్మరణం
కౌలు రైతులకు అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సైతం భరోసా కల్పిస్తామని హామి ఇచ్చినప్పటికి అమలు చేయడం లేదనే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వడ్డీ రేటు పెంచుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి బ్యాంకు రుణాలు, పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
నడిగడ్డలో వాణిజ్య పంటలపై రైతులు ఆసక్తి చూపుతారు. కృష్ణ, తుంగభద్ర నది పరివాహ ప్రాంతాలు జిల్లాలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో మిరప, సీడ్ పత్తి ఇతర పంటలు సాగుకు కౌలు రైతులు ఎకరాకు 20 నుంచి 35 వేల వరకు సైతం ఇచ్చేందుకు భూ యజమానితో ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మిరపకు మార్కెట్ లో ధరలు ఉండడంతో రానున్న సీజన్ లో సైతం మిరపకు ధర ఉంటుందనే ఆశతో నీటి సౌకర్యం ఉన్న పొలాలకు అధిక ధర వెచ్చించి కౌలుకు తీసుకుంటున్నారు. యూరియా కొనుగోలుకు సైతం భూ యజమానికి ఓటిపి రావడంతో ఇతర ప్రాంతాలలో కొందరు రైతులు ఉండడంతో సాంకేతిక సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. ఏటేటా పంట సాగుతో నష్టాల పాలవుతున్న దృష్ట్యా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు.
Also read: పట్టు చీరలకు డ్రై క్లీనింగ్ అవసరం లేదు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు