Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తరఫున ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఆయన మరణించడం పార్టీ శ్రేణుల్లో, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎర్రగడ్డ నివాసి అయిన మహమ్మద్ అన్వర్ నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కేవలం 40 ఏళ్ల చిన్న వయసులోనే అన్వర్ అకాల మరణం చెందడం స్థానిక నాయకులను, ఆయన అభిమానులను కలచివేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మహమ్మద్ అన్వర్ అక్టోబర్ 22న తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ను పరిశీలించి ఆమోదించారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరిగా ఆయన ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే, పోలింగ్ ముగిసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో అన్వర్ మృతి చెందడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ముఖ్యంగా.. ఫలితాలు వెలువడడానికి ఒకే రోజు ముందు జరిగిన ఈ ఘటనతో వారిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అన్వర్ కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అభ్యర్థి అయిన మహమ్మద్ అన్వర్ మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యువ నాయకుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయనకున్న ప్రజాదరణను వారు గుర్తుచేసుకున్నారు. మహమ్మద్ అన్వర్ మరణంతో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల సందర్భంగా విషాద వాతావరణం నెలకొంది.