K Kavitha: తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని గతంలో రంగనాథ్ రాసిన లేఖలను ఆధారంగా చూపిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. నిజాలు మాట్లాడిన తనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు సాయంత్రం లోపు హైడ్రా అధికారిక సామాజిక మాధ్యమాల నుండి తనపై పెట్టిన తప్పుడు వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోర్టుకు లాగుతానని స్పష్టం చేశారు.
హైడ్రా కమిషనర్ వైఖరిని తప్పుబడుతూ రంగనాథ్ గతంలో రాసిన లేఖల గురించి కవిత ప్రస్తావించారు. ఆదిత్య, కేడీఆర్ రియల్టీ సంస్థలు 0.37 ఎకరాల నాలాను ఆక్రమించి అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నాయని రంగనాథ్ అక్టోబర్ 2025లో తహసీల్దార్కు లేఖ రాశారని గుర్తు చేశారు. దీనివల్ల కోకాపేట, నార్సింగ్ ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయని స్వయంగా కమిషనర్ అంగీకరించారని తెలిపారు. తాము ఈ అక్రమాలపై ధర్నా చేస్తే ఆరు నెలల క్రితం తానే రాసిన లేఖలను మర్చిపోయి ఇప్పుడు ప్రభుత్వం బాకా ఊదుతోందని విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు గ్రాఫిక్స్ డిజైనర్లలా లేక కంటెంట్ క్రియేటర్లలా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా ఆక్షేపించారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1400 కోట్లు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెడుతోందని ఆరోపించారు. మూసీ బాధితులను సంప్రదించకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులతో క్లోజ్డ్ డోర్ మీటింగ్లు నిర్వహించడం వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు వివరించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నది గర్భంలో నిర్మాణాలకు అనుమతులు నిరాకరించామని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ఎలా అనుమతిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల విషయంలో తమ పోరాటం ఆగదని కవిత భరోసా ఇచ్చారు. అక్కడ 750 ఇళ్లను కూల్చివేయడంపై ఈ నెల 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భూదాన్ భూములను పేదల నుండి లాక్కొని బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పేదవాడి ఇల్లు కూల్చేసి పెద్దలను కాపాడే రియల్ ఎస్టేట్ ఏజెంట్లా ప్రభుత్వం మారిందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగి పట్టాలు ఇచ్చే వరకు విశారదన్ మహరాజ్తో కలిసి పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.