Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో, : కాకతీయ యూనివర్సిటీలో ఫెలోషిప్ కుంభకోణంపై చర్యలు తీసుకుంటామని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం ‘స్వేచ్ఛ’కు తెలిపారు. ఇప్పటి వరకు కేయూ తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్యపై మాత్రమే తమకు ఫిర్యాదు అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై శంకరయ్యకు ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలోనే చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ‘యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణం’ పేరిట ‘స్వేచ్ఛ’ పత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఈనేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. కేయూ తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్య పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ తీసుకుంటూనే పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్ గా జీతం తీసుకున్నారు.
Also Read: Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన
యూజీసీ నిబంధనల ప్రకారం పోస్ట్ డాక్టోరల్ ఫెలో షిప్ తీసుకుంటూ ఇతర ఉద్యోగం చేయడానికి వీల్లేదు. కానీ శంకరయ్య లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూనే ఫెలోషిప్, కాంటిజెన్సీ, హెచ్ఆర్ఏ కలిపి రూ.6,89,400 డ్రా చేశారు. అదే సమయంలో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్ గా 2,32,145 కూడా డ్రా చేశారు. దీనిపై యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు అందడంతో విచారణకు కమిటీని వేశారు. ఈ కమిటీ విచారణలో శంకరయ్య రూ.6,89,400 ఫెలోషిప్ ను అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఆ మొత్తాన్ని తిరిగి యూజీసీకి చెల్లించాలని, అలాగే ఇటు యూనివర్సిటీని, అటు యూజీసీని చీట్ చేసిన శంకరయ్యను టర్మినేట్ చేయాలని ఐదు నెలల క్రితమే సిఫార్సు చేసింది.
అయినా శంకరయ్య వివిధ మార్గాల ద్వారా యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ పై ఒత్తిడి పెంచడంతో నెల రోజుల క్రితం రిపోర్టును ఎంక్వైరీ కమిటీ రివ్యూ చేయాలని మరోసారి కమిటీకి పంపారు. కానీ కమిటీ సభ్యులు యూజీసీకి చెల్లించాల్సిన అమౌంట్ తగ్గించలేమని, అది తమ పరిధి కాదని పాత సిఫార్సులకే కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయినా కేయూ వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ విషయం బయటకు పొక్కి వార్తా కథనాలు రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇదే కోవలో మరికొందరు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి వారిపై చర్యలు తీసుకుంటారా? లేక ఫిర్యాదులు అందలేదని లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.
Also Read: Ugadi Travel Alert: ఉగాది ట్రావెలర్స్ కు బ్యాడ్ న్యూస్.. నో రైల్వే టిక్కెట్ రిజర్వేషన్స్!