Kaleshwaram Project: తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కీలక దశకు చేరుకుంది. ఈ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను కేవలం కమిషన్ మాత్రమే కాకుండా, కాగ్ (CAG), ఎన్డీఎస్ఏ (NDSA)నివేదికలు కూడా స్పష్టంగా ఎత్తిచూపాయని ఆయన కోర్టుకు వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఆయన ప్రస్తావించారు.
నీటిని ఎత్తిపోయడానికి విపరీతమైన విద్యుత్ వినియోగం జరుగుతోందని, ఇది రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థనే పునఃసమీక్షించాల్సిన క్లిష్ట పరిస్థితిని కల్పించిందని తెలిపారు. ప్రజాధనం భారీగా వెచ్చించిన ప్రాజెక్టులో లోపాలు ఉన్నప్పుడు, వాస్తవాలను వెలికితీసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని సమర్థించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాధనం దుర్వినియోగం లేదా వృథా అయిన సందర్భాల్లో విచారణ కమిషన్లను ఏర్పాటు చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. కమిషన్ నిష్పాక్షికంగా తన విధులను నిర్వర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం , కమిషన్ తరఫున వాదనలు దాదాపు పూర్తయ్యాయి. అయితే.. సమయాభావం వల్ల ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు పిటిషనర్ల తరఫున ప్రత్యుత్తరాలు లేదా కోర్టు తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు , బాధ్యుల నిర్ధారణలో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది.
Also Read: జగిత్యాల బీజేపీలో హైడ్రామా.. శ్రావణి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత