Konda Surekha latest news(Telangana news): అనాదిగా భారతదేశంలో ఏనుగును వినాయక స్వరూపంగా భావిస్తుంటాం. తమిళనాడు,కేరళ, కర్ణటక ప్రాంతాలలో కొన్ని ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేకంగా ఓ ఏనుగు ఉంటుంది. అక్కడ దేవస్థానం తరపున జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్స వ ఊరేగింపులలో ఏనుగు కు ప్రత్యేక స్థానం ఇస్తారు. అలంకరించిన అంబారీపై దేవుడిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆలయాలలో ఏనుగును పోషించడం అంటే తలకు మించిన భారంగా తయారవుతోంది. అందుకే ఇలాంటి ఉత్సవాల సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి ఏనుగును రప్పించుకుని మళ్లీ ఉత్సవాలు పూర్తి కాగానే వారికి అప్పజెప్పడం జరుగుతుంది. ప్రస్తుత తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణకు సంబంధించి సంప్రదాయ ఉత్సవాలలో ఏనుగు పై దేవుడిని ఊరేగించేందుకు ఓ ఏనుగు కావాలని రాష్ట్రానికి ప్రతిపాదించి అమోద ముద్ర వేయించుకున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే కర్ణాటక అటవీ శాఖ మంత్రితో కొండా సురేఖ పలుమార్లు జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఏనుగును తెలంగాణకు తరలించేందుకు అక్కడి అటవీ శాఖ అధికారులు సంసిద్ధమవుతున్నారు.
కర్ణాటక ప్రాంతం నుంచి
కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరె లోని పాంచాచార్య మందిర ట్రస్టు కు సంబంధించి రూపవతి అనే ఏనుగును తెలంగాణ కు పంపించే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.తెలంగాణలో రాబోయే బోనాలు, మొహర్రం పండుగలను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత తొందరలో రూపవతి ఏనుగును రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏనుగు ఊరేగింపును ఎంతో ఘనంగా భావిస్తుంటారు. భారతదేశంలోనే వారసత్వ సంపదగా ఏనుగును భావిస్తుంటారు. థాయిలాండ్ దేశపు జాతీయ జంతువుగా ఏనుగుకు గుర్తింపు లభించింది.
ఏనుగుల దినోత్సవం
2012 సంవత్సరం నుంచి ఏటా ఏనుగుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. అలాగే వరల్డ్ ఎలిఫెంట్ సొసైటీ కూడా ఏర్పడింది. భారతదేశంలో 2017 లో ఏనుగుల లెక్కలపై ఓ సర్వే నిర్వహించడం జరిగింది. దేశం మొత్తం మీద 27,312 ఏనుగులు ఉన్నట్లు తేలింది. అయితే మారుతున్న వాతావరణం దృష్ట్యా ఏనుగు కూడా అందరిస్తున్న జాతులలో ఒకటిగా మరింది. 2012 నుంచి దాదాపు 300 ఏనుగులు అంతరించాయని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాటి సంరక్షణ ప్రశ్నార్థకమవుతోంది ప్రభుత్వానికి. ఓ పక్క అంతరించిపోతున్న అడవులు, మరో పక్క వాటి పోషణకు అయ్యే ఖర్చులు, వాతావరణ మార్పులతో క్రమంగా ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్నది. అందుకే ఏనుగులను ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ లోని కొన్ని ప్రముఖ ఆలయాలు వాటి ఆదాయం బట్టి ఏనుగుల సంరక్షణ బాధ్యత వహిస్తూ వస్తున్నాయి.
నియమనిబంధనలు
అటవీ శాఖ అధికారుల నుంచి ఏనుగును పెంచుకోవడానికి అనుమతి రావడానికి కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఏనుగు పోషణ, వాటి సంరక్షణ వంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం దేవుడి ఊరేగింపులకు తప్ప ఇతరత్రా పనులు వాటికి అప్పజెప్పకూడదు. వాటికి కష్టం కలిగించేలా శిక్షించరాదు..ఇలాంటి నిబంధనలకు ఓకే అన్న తర్వాతే ఏనుగును అప్పగించడం జరుగుతుంది. ఈ విషయంలో కొండా సురేఖ చేసిన కృషికి తెలంగాణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.