Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందంటూ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఇరుకున పెట్టేలా ఆమె సంధించిన విమర్శలు ఇప్పుడు కాషాయ నేతలకు మింగుడుపడడం లేదు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట లభించిన నేపథ్యంలో ఆమె మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని వెనుకంజలో ఉండేలా చేసింది. మళ్లీ అవే విమర్శలు మళ్లీ తెరపైకి రావడంతో బీజేపీ ఇరకాటంలో పడింది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. తాజాగా కవిత చేసిన కామెంట్స్ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కావాలనే వెనక్కి తగ్గి బీజేపీకి దారి ఇచ్చిందని, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో బీజేపీ వెనక్కి తగ్గి బీఆర్ఎస్కు మేలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి నడవడానికి ఇది తొలిమెట్టు అని ఆమె స్పష్టం చేయడం బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆందోళనలో పడేసింది. బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యమని చెప్పుకునే బీజేపీ, ఇప్పుడు అదే పార్టీతో లోపాయికారీ పొత్తు పెట్టుకుందన్న వార్తలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో గందరగోళాన్ని నింపుతున్నాయి.
Also Read: Ramchander Rao: నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నిరాహారదీక్ష.. వారి డిమాండ్లు ఇవే..?
కవిత జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని, హెచ్చరించిన కవిత, తన తండ్రి కేసీఆర్.. బీజేపీపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని కూడా గతంలో లేఖ ద్వారా ఎండగట్టారు. తెలంగాణ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ భావిస్తోందని ఆమె చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేతలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం కవిత వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడే పనిలో పడ్డారు. మొత్తానికి కవిత చేసిన ఈ కామెంట్స్ బీజేపీని తెలంగాణలో డిఫెన్స్లో పడేసిందనడంలో సందేహం లేదు.
Also Read: Temple Land Survey: ఆలయ భూముల కబ్జాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..?