Kalvakuntla Kavitha: తప్పుడు కేసు పెట్టి తనను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా గురువారం తిరుమలకు వెళ్లిన కవిత.. అనంతరం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందన్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకం అన్నారు. కాలి నడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందన్నారు. కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా మా కుటుంబం, జాగృతి కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకోవటానికి వచ్చామన్నారు. ఆంధ్రాలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. త్వరలోనే తాము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు.
దిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, కవితతోపాటు 23 మందికి ఇటీవల సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తానని గతంలోనే చెప్పినట్లు గుర్తుచేశారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఈ కేసు వల్ల తాను.. నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించామని పేర్కొన్నారు. నా కుటుంబానికి దూరమై ఐదు నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు.
Also Read: Strait of Hormuz: యుద్ధం వేళ.. భారత్కు ఇరాన్ గుడ్ న్యూస్.. హమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చు!
కవితతోపాటు మాజీ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియాలకు ఊరట లభించింది. తీర్పు సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. వేలాది పేజీల చార్జ్షీట్లో సాక్ష్యాలకు మద్దతు లేని అంశాలున్నాయని పేర్కొంది. మనీష్ సిసోడియా, కేజ్రీవాల్పై సరైన ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని అభిప్రాయపడింది. ప్రధాన నిందితుడు కుల్దీప్సింగ్పైనా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు న్యాయస్థానం ఆదేశించింది.
Also Read: Viral Video: రీల్స్ పిచ్చితో.. రైలులో వెర్రి వేషాలు.. చివరికి ఏమైందో చూడండి!