Kavitha: తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయా? ఎమ్మెల్యే కవిత అసలు గేమ్ మొదలుపెట్టారా? బీఆర్ఎస్ నాన్చుడి ధోరణి ఆమెకు నచ్చలేదా? అందుకే తానేంటో చూపించాలని భావిస్తున్నారా? ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారా? ఈ దెబ్బకు బీఆర్ఎస్ హైకమాండ్ దిగిరావడం ఖాయమా? అవుననే అంటున్నారు ఆ పార్టీలో కొందరు నేతలు.
కవిత గేమ్ మొదలైంది?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. కవిత వద్దకు సోమవారం కేసీఆర్ మధ్యవర్తులతో రాయబారం పంపారు. మంగళవారం కవిత కాంగ్రెస్ హైకమాండ్తో మంతనాలు సాగించారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కవిత వేగంగా అడుగులు వేయడానికి కారణాలేంటి? గడిచిన ఐదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె ఇబ్బందిపడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసమే పార్టీలో తన పోస్టు ఏంటని బీఆర్ఎస్ పంపిన రాయబారులను నేరుగా ప్రశ్నించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కవిత విషయాన్ని హైకమాండ్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఆమెని చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, దాన్ని ఆ పార్టీ అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సైలెంట్గా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
బీఆర్ఎస్లో టెన్షన్?
కాంగ్రెస్తో కవిత మంతనాలు సాగిస్తుందని వార్త బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ వైపు వెళ్తే.. పార్టీ నిట్ట నిలువునా చీలిపోయే అవకాశముందని భావిస్తోంది. ఇప్పుడున్న సమయంలో కవిత విషయంలో ఆలస్యం చేస్తే మొదటికే ముప్పువస్తుందని కేసీఆర్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాన్చుడి ధోరణి రాజకీయాలకు కాలం చెల్లిందని, వేగంగా నిర్ణయాలు తీసుకోని పక్షంలో పార్టీకి గడ్డుకాలం తప్పదని అంటున్నారు కొందరు నేతలు.
ALSO READ: రూల్స్ అధిగమిస్తే కష్టాలు తప్పవు.. వాళ్లపై ట్రాఫిక్ పోలీసుల గురి
కవిత విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటారా? తెగే వరకు చూస్తారా? అనేది చూడాలి. కవిత దూకుడుపై ఆ పార్టీ నేతల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. సొంత కూతురికి పార్టీలో ఇలా జరిగితే, తమ పరిస్థితి ఏంటని అప్పుడే చర్చించుకుంటున్నారు కొందరు నేతలు. ఒకవేళ కవిత మరో పార్టీలోకి వెళ్లినా కేవలం కాంగ్రెస్ వైపు మాత్రమే వెళ్తుందని అంటున్నారు. మోదీ సర్కార్ ఆమెని జైలుకి పంపడంతో బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు.
ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టే సాహసం చేయకపోవచ్చు. పార్టీని నడపడమంటే ఆషామాషీ కాదని అంటున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అంటున్నారు. తన బలం ఏంటో చూపించేందుకు జాగృతి పేరిట ప్రత్యేకంగా సంఘాలను నియమిస్తుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకోకుంటే ఆడపడుచును ఆ పార్టీ బయటకు తోసిందనే అపవాదు మూటగట్టుకుంటుందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎటు చూసినా కవిత వ్యవహారం బీఆర్ఎస్కు మింగుడుపడని అంశంగా మారిందని అంటున్నారు.