Ramchander Rao: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపో మాపో జైలుకు వెళ్తాడని, ఆయన ఏమైనా ఫ్రీడం ఫైటరా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ కూడా సిట్ విచారణకు హాజరయ్యారని, అలాంటిది కేసీఆర్ ఇప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి అని, విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోటీ చేస్తోందని చెప్పారు. మొట్టమొదటిసారి మొత్తం మున్సిపాలిటీల్లో బరిలో దిగుతున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద రూ.25 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 శాతం కింద రూ.250 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని తెలిపారు. ఈ డబ్బు ఏమైందని రాంచందర్ రావు ప్రశ్నించారు.
గత ప్రభుత్వం 10 శాతం, ప్రస్తుత ప్రభుత్వం 20 శాతం ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు దొబ్బుకు తిన్నారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ప్రజలు కట్టిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దోపిడీ, డ్రగ్స్, రాబరీ, ఫైర్ యాక్సిడెంట్లు కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజెస్ గా నిలుస్తున్నాయని విమర్శించారు. కేంద్ర నిధులు లేకపోతే మున్సిపాలిటీలు మూతపడతాయన్నారు. మున్సిపాలిటీ మినిస్టర్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అజ్ఞాతంలో ఉన్నారని చురకలంటించారు. అన్ని బోగస్ సర్టిఫికెట్లు వస్తున్నాయని, రేవంత్ కు ఇచ్చిన సర్టిఫికెట్ ను క్రాస్ చెక్ చేయాలని రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. గతంలో రేవంత్ కు భాస్కర్ అవార్డ్ ఇచ్చారని సెటైర్లు వేశారు. ఫాంహౌస్ లన్నా.., ఫాంహౌస్ రాజకీయాలన్నా బీఆర్ఎస్ కు మక్కువ అని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీలో ఎవరెవరికి ఎన్ని ఫాంహౌస్ లున్నాయోనని అనుమానం వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Bandi Sanjay: కరీంనగర్లో మనదే గెలుపు.. తొందరపడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: బండి సంజయ్
ఇదిలా ఉండగా పుర పోరుకు సంబంధించి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జీ, జిల్లా ఇన్ చార్జీలతో రాంచందర్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్, కార్పొరేషన్లలో మేయర్, చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. గెలిచే చోట్ల కార్యకర్తలకే టిక్కెట్లు ఇస్తామని, గెలిచే అవకాశం లేని స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టంచేశారు. ఆ స్థానాల్లో టిక్కెట్లు దక్కని కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, తొందరపడి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని హెచ్చరించారు. పార్టీని దూషించడమంటే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని పేర్కొన్నారు. బీజేపీలో ఉంటూ ఇతర పార్టీల తరపున నామినేషన్ వేసిన వారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ మళ్లీ వారిని బీజేపీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో కొత్త, పాత, సీనియర్, జూనియర్ తేడా లేదని, కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టంచేశారు.