కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు తన భవిష్యత్తు కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ మంత్రి పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల్లో ఎప్పుడూ తగిన గుర్తింపు గౌరవం ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి ఉద్యమకారుల సేవలు ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేసిన చరిత్ర తనకు ఉందని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడే నాయకులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఇబ్బందులు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. నిన్న ముఖ్యమంత్రితో తాను ప్రత్యేకంగా సమావేశం కాలేదని తెలిపారు. సచివాలయంలో ఇద్దరం ఎదురుపడినప్పుడు సాధారణంగా పలకరించుకున్నామని వివరించారు. దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీపైనా రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ ను కలవడం కేవలం సాధారణ విషయమని చెప్పారు. ఆ సమయంలో రాజకీయాలతో పాటు అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను కేటీఆర్ ముఖం మీదే చెప్పానని వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సొంతంగా 88 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. అంత మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తీవ్రమైన తప్పిదమని కేటీఆర్ కు తేల్చి చెప్పినట్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలను బలహీనపరచడం సరైన పద్ధతి కాదని హితవు పలికినట్లు పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న తరుణంలో ఆయన చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఉద్యమకారులకు పెద్దపీట వేయాలంటూ ఆయన పరోక్షంగా అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించినట్లు అర్థమవుతోంది.
ALSO READ: Telangana Registrations: తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం.. సర్వర్లలో సాంకేతిక లోపం