Komatireddy Venkat Reddy: రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖను అత్యంత కీలకమైన ఇంజిన్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు 2026-27 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఏడాది బడ్జెట్ వినియోగం, పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించిన మంత్ర.. రాబోయే ఏడాదికి సంబంధించి పక్కా ప్రణాళికతో బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వంటి ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని 2047 రైసింగ్ తెలంగాణ దార్శనికతలో భాగంగా రాష్ట్ర రోడ్డు నెట్వర్క్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హ్యామ్ (HAM) మోడల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అద్దం లాంటి రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని.. అధికారులు ఎక్కడా రాజీ పడకుండా మనసు పెట్టి పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్-విజయవాడ (NH 65) 8 లైన్ల విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండున్నర గంటలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పనులు వేగవంతం చేయాలని మరోసారి కోరనున్నట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమైన ప్రాజెక్టుల విషయంలో తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తానని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఉన్న అడ్డంకులను అధిగమించి, శాఖను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పునరుద్ఘాటించారు.
Also Read: దమ్ముంటే సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టండి.. కలెక్టర్, పోలీసులకు సుమన్ సవాల్!