Balka Suman: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, పోలీసులు మంత్రి వివేక్ వెంకటస్వామికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ తీవ్రంగా ఆరోపించారు. మున్సిపల్ అధికారులే స్వయంగా కౌన్సిలర్ల బంధువుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రామకృష్ణపూర్ ఎస్సై శ్రీధర్, మంత్రి ఇంట్లో పనిమనిషిలా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తూ.. నిన్నటి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ధైర్యముంటే బయటపెట్టాలని పోలీసులకు, కలెక్టర్కు సవాల్ విసిరారు.
రామకృష్ణపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద రాళ్లు విసిరింది కాంగ్రెస్ కార్యకర్తలేనని.. ఆ దాడిలో బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డి కారు ధ్వంసమైందని సుమన్ వివరించారు. తనపై రాయి విసిరినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను ఫుటేజీలో స్పష్టంగా ఉన్నానని, రాయి మరో వైపు నుండి వచ్చిందని స్పష్టం చేశారు. బాధితులైన తమ పార్టీ నాయకులపైనే కేసులు పెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంఖ్యాబలం లేకపోయినా కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో మంత్రి వివేక్ , ఆయన కుమారుడు కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూశారని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. వారిని తాకడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని సుమన్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి అవమానిస్తున్నారని.. సొంత మీడియా ఛానెల్ని వాడుకుని తనపై ‘గుండా’ అని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు కేసులు, అరెస్టులకు తాము భయపడబోమని.. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని సుమన్ స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని.. మహిళా కౌన్సిలర్లు మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. 14 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ను, 7 సీట్లు ఉన్న కాంగ్రెస్ అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
Also Read: నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపండి.. కల్వకుంట్ల కవిత ఫైర్!