తెలంగాణ రాజకీయాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోడీ పర్యటనను పురస్కరించుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ముఖ్యంగా హిందూ నినాదమైన ‘జై శ్రీరామ్’ అంశంపై ఆమె స్పందించిన తీరు పట్ల బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి దైవ చింతనను అవమానించడం సరికాదని కమలం పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
హాట్ టాపిక్ గా మంత్రి వ్యాఖ్యలు..
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బీజేపీ నాయకులు కేవలం నినాదాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ‘జై శ్రీరామ్’ అంటే పైసలు రాలుతాయా లేక పథకాలు వస్తాయా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రధాని పర్యటన వేళ కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడం మినహా బీజేపీ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బీజేపీ ఫైర్
మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధికారికంగా స్పందించింది. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కాదు దైవద్రోహ శాఖ మంత్రి అంటూ ఎక్స్ వేదికగా ఘాటు విమర్శలు చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ నాయకులు హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడింది. శ్రీరాముడిని అపహాస్యం చేయడం అంటే హిందూ సమాజాన్ని అవమానించడమేనని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్లను కించపరిచేలా మాట్లాడే వారికి మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు.
క్షమాపణలకు బీజేపీ డిమాండ్..
మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. హిందూ సమాజానికి ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బాధ్యత గల వ్యక్తులు మాట్లాడటం గమనార్హం. దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ భక్తిని తక్కువ చేసి మాట్లాడటం ఆమె అజ్ఞానానికి నిదర్శనమని విమర్శకులు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. మంత్రి వ్యాఖ్యల ఉద్దేశం దేవుడిని అవమానించడం కాదని కేవలం బీజేపీ రాజకీయాలను ఎండగట్టడమేనని సమర్థించుకుంటున్నారు. అభివృద్ధిని విస్మరించి కేవలం భక్తి పేరుతో రాజకీయాలు చేయడంపైనే ఆమె స్పందించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పేరును వాడుకోవడంపై జరుగుతున్న ఈ చర్చ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.
ALSO READ: తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్తో సేవలకు అంతరాయం