E-Paper
Advertisement

KTR Adopted Village : దేశాయిపేట దశ మారేదెన్నడు.. కేటీఆర్ దత్తత గ్రామం దుస్థితి..

KTR Adopted Village : దేశాయిపేట దశ మారేదెన్నడు.. కేటీఆర్ దత్తత గ్రామం దుస్థితి..

KTR Adopted Village : దత్తత తీసుకోవడం అంటే సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. అందులోనూ ఓ ఊరి ప్రజలకు హామీ ఇస్తే బాధ్యత తీసుకోవాలి. శ్రీమంతుడు సినిమా వచ్చిన తర్వాత పొలిటీషియన్లు దత్తత హడావుడి మామూలుగా చేయలేదు. ఒకే రోజులో హీరోలు అయిపోయేలా బిల్డప్‌లు ఇచ్చారు. అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయినా.. ఆయన కుమారుడు కేటీఆర్‌ అయినా.. అల్లుడు హరీష్‌రావు అయినా రిజల్ట్‌ ఒక్కటే.. దత్తత అని ప్రకటన చేస్తే ఇక అంతే సంగతి. మళ్లీ ఆ పల్లెను తిరిగి చూసేదే లేదు. ఏదో జరిగిపోతుంది. తమ బతుకులు బాగుపడతాయనుకున్న జనానికి ఎదురు చూపులే మిగులుతున్నాయి. ఎన్నికలు రాగానే హడావుడి చేస్తున్న నేతలు ఆ తర్వాత మీ చావు మీరు చావండి అని వదిలేస్తున్నారు. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. సిరిసిల్ల జిల్లా దేశాయిపేట గ్రామాన్ని ఏమాత్రం ఉద్ధరించారో ఓసారి చూద్దాం.

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దేశాయిపేట గ్రామాన్ని మంత్రి కేటీఆర్ దాదాపు 10 సంవత్సరాల క్రితం దత్తత గ్రామంగా స్వీకరించారు. ఎనిమిది వందల జనాభా ఉన్న పల్లెను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దత్తత తీసుకోవడం అంటే అందర్నీ బాగు చేయడం.. జీవితాల్లో వెలుగులు నింపడం అని శ్రీమంతుడు సినిమాలో మహేష్‌ బాబు స్థాయిలో డైలాగ్‌లు పేల్చారు మంత్రిగారు. ముఖ్యమంత్రి కుమారుడు, అందులోనూ మంత్రి.. ఇక రాజు మాట ఇస్తే మామూలుగా ఉంటుందా.. సకల సౌకర్యాలు నడుచుకుంటూ వస్తాయి.

ఉద్యోగం, ఉపాధి ఇలా అన్ని రకాలుగా తమ జీవితాలు మారిపోతాయని.. తమ దశ మారినట్లేనని దేశాయిపేట గ్రామస్థులు భావించారు. రోజులు గడిచాయి. నెలలు పూర్తయ్యాయి. సంవత్సరాలు దాటాయి. చివరకు దశాబ్ధకాలం పూర్తవుతోంది. కేటీఆర్‌ని నమ్మినవారి బతుకులు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఊర్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఓ బుగ్గ కారు హారన్‌ మోగించుకుంటూ వచ్చినా అది కేటీఆరేనేమో అని దేశాయిపేట వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మీ నమ్మకమే మా పెట్టుబడి అన్నట్లుగా.. జనం నమ్మకాన్ని పొలిటీషియన్లు దెబ్బతీస్తున్నారు. అందులోనూ కేటీఆర్‌ లాంటి కీలక నేత కూడా ఇలా చేస్తారని అనుకోలేదని దేశాయిపేట గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. దత్తత ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని గ్రామస్తులు వాపోతున్నారు. మౌలిక వసతుల కల్పనలో గాని, అభివృద్ధిలో గాని ముందడుగు వేయలేదంటున్నారు. నియోజకవర్గంలోని ఇతర గ్రామాలకు వచ్చినట్టే తమ పల్లెకు కాస్తాకూస్తో నిధులు వచ్చాయి తప్ప.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన దత్తత ప్రకటన.. హామీగానే మిగిలిపోయిందని జనం మండిపడుతున్నారు.

మంత్రి కేటీఆర్ గ్రామానికి మొదటిసారిగా పదేళ్ల క్రితం వచ్చినప్పుడు ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. పరిస్థితి మాత్రం మరోలా ఉంది. రోడ్లు, స్మశాన వాటిక తప్ప మిగతా అభివృద్ధి పనులు జరగలేదు. చేసిన పనులు కూడా నాసిరంగా ఉన్నాయి. శ్మశాన వాటిక ప్రహరీ గోడ కూడా కూలిపోయి సంవత్సరం పైనే అయింది. ఇంతవరకు దాన్ని పునఃనిర్మించలేదు. గ్రామాభివృద్ధికి అరకొర నిధులు ఇచ్చి అభివృద్ధి జరిగిందంటే ఎలాగని జనం ప్రశ్నిస్తున్నారు.

వరో వస్తారని ఏదో చేస్తారని.. ఎదురూ చూసి మోసపోకుమా.. నిజం మరచి నిదుర పోకుమా.. అంటూ శ్రీశ్రీ రాసిన గీతాన్ని దేశాయిపేట వాసులు పాడుకుంటున్నారు. రాజకీయ ఎత్తుగడల కోసం తమలాంటి అమాయక ప్రజలకు ఆశలు కల్పించి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్‌ నేతలు ఎవరైనా దత్తత పేరెత్తి ఊర్లోకి ఓటు వేయమని అడిగేందుకు వస్తే పొలిమేర్ల వరకు తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×