కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కాదని, ఆయన ఆ పార్టీ మనిషే కాదని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ‘కాంగ్రెస్ 420 హామీలను ప్రజల ముందు ఉంచింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులవుతున్నా.. వాటిలో ఒక్కటంటే ఒక్క హామీనైనా సంపూర్ణంగా నెరవేర్చిందా?’ అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళలను ఫ్రీ బస్సు పేరిట వంచించారని, ఆ పథకం క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పడం కాంగ్రెస్ నైజమని, ఆ పార్టీ నేతలందరూ స్టువర్ట్పురం దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలో పోచారం చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ‘ఒక ఆంబోతు, రెండు దున్నపోతులంటూ పోచారం మాట్లాడారు. బండ కట్టుకొని బాయిలో దూకుతానని చెప్పిన ఆయన, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్లో చేరారు?’ అని ఎద్దేవా చేశారు. పోచారంకు నిజంగా దమ్ముంటే, తన పదవికి తక్షణమే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. నైతిక విలువలు వదిలి రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
తెలంగాణను కేసీఆర్ ఉన్నప్పుడే ‘బంగారు తెలంగాణ’గా మార్చారని కేటీఆర్ గుర్తు చేశారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చిందని, సంక్షేమ పథకాల్లో తెలంగాణను అగ్రపథాన నిలిపారని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ALSO READ: Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?