Tejasvi Surya Telangana comments: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి. తెలంగాణ విభజనను భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఖండించారు. బీజేపీ నరనరనా తెలంగాణ వ్యతిరేకత నిండి ఉందని, ఆ పార్టీ తక్షణమే తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ నేతలు మరోసారి దెబ్బతీశారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని, వేలాది మంది యువకుల బలిదానాలు, సుదీర్ఘ పోరాట ఫలితమని ఆయన గుర్తు చేశారు. అస్తిత్వం కోసం జరిగిన ఒక ప్రజాస్వామ్య పోరాటాన్ని, దేశ విభజన వంటి విషాదకర సంఘటనతో పోల్చడం తేజస్వి సూర్య అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రధాని మోదీ నుంచి మొదలుకొని నేటి ఎంపీల వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆ వ్యాఖ్యలనే బీజేపీ అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీజేపీ ఎంపీ విషం చిమ్ముతున్నా తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వీరు, ఢిల్లీ పెద్దల ముందు వంగి రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. “బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉండి ఉంటే తేజస్వి సూర్య సంగతేమిటో తేల్చేవారు. కానీ నేడు గెలిచిన ఎంపీలు కేవలం దిష్టిబొమ్మలుగా మారారు.” అని ఎద్దేవా చేశారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు భారత్-పాక్ విభజన వంటిదే అయితే, ఆనాడు బీజేపీ పార్లమెంట్లో విభజన బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ నేడు దేశానికే రోల్ మోడల్గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ అంటే ఒక పోరాట గాథ అని, త్యాగాల చరిత్ర అని కేటీఆర్, హరీశ్ రావు గుర్తు చేశారు. స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన ఈ గడ్డను అవమానిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అస్తిత్వ పోరాటాన్ని అవహేళన చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరని, రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
Read Also: డీలిమిటేషన్తో నో వర్రీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెరగనున్న ఎంపీల సంఖ్య ఇదే, అమిత్ షా కీలక వ్యాఖ్యలు