
BRS: కేసీఆర్ ఏదో మేజిక్ చేస్తున్నట్టు ఉన్నారు. వరుసబెట్టి ఇతర రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మరికొందరు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల నాటికి గులాబీ కారు అన్ని రాష్ట్రాల్లో కనిపించినా ఆశ్చర్యం లేకపోవచ్చు అంటున్నారు.
లేటెస్ట్ గా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కు చెందిన పలువురు నాయకులు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు. మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్గఢ్కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ లు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు.
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు తదితర పథకాలను వారికి వివరించారు కేసీఆర్. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి ఇతర కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు.
జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ఆ నాయకులు ఆహ్వానించారు. దేశంలో ప్రస్తుతం కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించిన నాయకులు.. పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే వారంతా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈనెల 6న నాంధేడ్ లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పలువురు మరాఠా నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు.