Kamalesh: కలియుగ దేవుడు శ్రీవేంకటేశ్వరుడు. ఏడుకొండలపై వెలిసిన భక్తజన ప్రియుడు. ఆపదమొక్కులవాడు. అనాథరక్షకుడు. అందుకే, తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం లక్షలాది భక్తులతో కళకళలాడుతుంటుంది. శ్రీవారి దర్శనభాగ్యంతో భక్తకోటి పులకించిపోతారు. శక్తికొలది కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల అనే కాదు.. ఏ ఆలయంలోనైనా హుండీలో కానుకలు వేసి ఆ దేవదేవుడిని కోరికలు తీర్చమని వేడుకుంటారు. అయితే, ఇలా దేవునికి కానుకలు సమర్పించడం స్వార్థపూరితమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ ప్రముఖుడు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ..రచ్చ నడుస్తోంది.
ప్రముఖుడంటే అలాంటి ఇలాంటి ప్రముఖుడు కాదాయన. ఇటీవలే ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు సైతం ప్రకటించింది. ఆయనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్. శ్రీరామచంద్ర మిషన్ అధినేత. రాజయోగంలో సుప్రసిద్ధ గురువు. అలాంటి కమలేష్ పటేల్ దేవునికి కానుకలు సమర్పించడంపై కామెంట్లు చేసి కాంట్రవర్సీ రేపారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…
“హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితం. అవి ఏ ట్రస్టుకో, పూజారికో వెళ్తాయి. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు. నిజమైన భక్తితోనే దేవుని కృప సాధ్యం”. అంటూ కమలేష్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై పలు వర్గాలు మండిపడుతున్నాయి. తమ సెంటిమెంట్ దెబ్బతీసేలా మాట్లాడారంటూ పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.