Urban Development: స్వేచ్ఛ బ్యూరో: మహబూబ్నగర్ పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు సంవత్సరాలు మూడు నెలల కాలంలో పట్టణ అభివృద్ధికి విస్తృత చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, ట్రిపుల్ ఐటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు
ఈ విద్యాసంస్థల ఏర్పాటుతో ఇతర జిల్లాల నుంచి విద్యార్థుల రాక పెరిగి, అద్దె గృహాలు, చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడం ద్వారా అభివృద్ధి పనులకు మరింత నిధులు సమకూరే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణ జనాభా సుమారు 3.30 లక్షలు ఉండగా, 2047 నాటికి 5 లక్షలకు పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
తాగునీటి సమస్య పరిష్కారం
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 220 కోట్లతో వాటర్ ఆగ్మెంటేషన్ పథకం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 40 MLD నీటి అవసరం ఉండగా, 20–30 MLD మాత్రమే అందుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 14 రిజర్వాయర్లు, 18.6 మిలియన్ లీటర్ల నిల్వ సామర్థ్యం, 40 కి.మీ ఫీడర్ పైపులు, 209 కి.మీ పంపిణీ నెట్వర్క్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో 60 MLD నీటి సరఫరా అందించనున్నట్లు వివరించారు.
డ్రైనేజ్ సమస్యలకు చెక్
డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి ₹600 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు. అనియంత్రిత లేఅవుట్లు, ఆక్రమణలు, చిన్న రహదారులు సమస్యలను క్లిష్టతరం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే పట్టణానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
అదే విధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్లు, నేషనల్ హైవే కనెక్టివిటీ విస్తరణ, బెంగళూరు ఎక్స్ప్రెస్వేతో అనుసంధానం, ఎకనామిక్ కారిడార్లో భాగస్వామ్యం ద్వారా మహబూబ్నగర్ను లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
కొన్ని అభివృద్ధి పనులకు భూసేకరణ అవసరం ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు ఎస్. శేఖర్, పెద్దగొల్ల నర్సింహులు, రమేష్ రెడ్డి, కిషన్ నాయక్, విట్టల్ రెడ్డి, యాదగిరి, నాయకులు శాంతన్న యాదవ్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Viral News: సినిమా లెవల్ క్లైమాక్స్ సీన్.. తాళికట్టే టైంకి పెళ్లి కూతురు అలా చేసిందేంటి?