Mallareddy : సోదాల సందర్భంగా విధులకు ఆటంకం కలిగించారన్న ఐటీ అధికారుల ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను సంతకం చేసిన తర్వాతే అధికారులు బయటకు వెళ్లారని తెలిపారు. ఎవరి విధులకు అడ్డుపడలేదని స్పష్టం చేశారు. వందకోట్లు బ్లాక్మనీ ఉన్నట్లు రాసి తన కొడుకుతో బలవంతంగా సంతకం చేయించారని మంత్రి ఆరోపించారు. కొడుకు సంతకం పెట్టిన ఫైల్స్ను చూపించడం లేదన్నారు. ఇలాంటి రైడ్ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చూపిస్తే ఫైన్ కడతామన్నారు. తాము దొంగలమా? ఇంత అరాచకమా? అని ప్రశ్నించారు. తన కొడుకును ఆస్పత్రిలో చేర్చినట్లు కూడా ఐటీ అధికారులు చెప్పలేదని మండిపడ్డారు.
ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ రైడ్స్ ఉంటాయని మల్లారెడ్డి అన్నారు. ఎన్ని రైడ్స్ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ ముందే చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఇంత కుట్ర అవసరమా? బీజేపీ కుట్రలకు భయపడేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.
తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే ఐటీ దాడులు చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదవు చెప్పించామని తెలిపారు. ఇప్పటి వరకు తమపై 3సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మెడికల్ సీట్లు అడ్మిషన్లలో అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదని తెలిపారు. ఎంబీబీఎస్లో మెనేజ్మెంట్ కోటా లేదన్నారు. ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ జరుగుతుందని వివరించారు. మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి? అని మల్లారెడ్డి ప్రశ్నించారు.
మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. బోయిన్పల్లి సౌజన్య కాలనీలోని అల్లుడు ఇంటికి మంత్రి మల్లారెడ్డి వెళ్లారు. కూతురు, మనవరాలు, వియ్యంకుడితో 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఐటీ దాడుల నేపథ్యంలో జరిగిన పరిణామాల గురించి ఆరా తీశారు.